Monday, January 5, 2009

నేడు విజయవాడలో కొ .కు .శతజయంతి సభ

*ఈ రోజు ఈనాడులో నరసింహ మూర్తి గారి వ్యాసం చదివే వుంటారు .చదవని వారి కోసం క్లుప్తంగా ....

తెలుగు వాళ్లకు కొ .కు.గా పరిచయమున్న ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు.ఇరవై ఎనిమిదేళ్ళు "చందమామ 'సంపాదకులుగా వుంటూ అటు పిల్లలను ,ఇటు పెద్దలను ఒకే రీతిగా సంతోష పెట్టగల తెలుగు రచయిత కొ .కు.గారు . 20-10-1909 వ తేది , తెనాలి లో ఆయన జన్మించారు .డెబ్బై ఒక్క సంవత్సరాల జీవితంలో దాదాపు అరవై సంవత్సరాల పాటు ఎడతెగని రచనలు చేశారు .'ప్రాణాధికం ' ఆయన రాసిన తొలి కధ .1925 వరకు తెనాలిలో పాఠశాల విద్య ,గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు .తర్వాత విజయనగరం మహారాజా కళాశాలలో భౌతిక శాస్తంలో పట్టభద్రులయ్యారు .బనారసు విశ్వ విద్యాలయంలో m.s.c లో చేరారు .కాని ఆర్ధిక పరిస్థితుల కారణంగా రెండవ సంవత్సరంలో ఆయన చదువు ఆగిపోయింది .ఇక ఆయనకు పదహారేళ్ళ వయసులోనే పద్మావతి గారితో వివాహం జరిగింది .బనారసులో చదివే కాలంలోనే కొ .కు. నాస్తికవాది ,వ్యాసకర్త ,కధకుడు అయ్యారు .సిమ్లా ,బొంబాయి ,మద్రాసు ....ఎన్నో చోట్ల గుమస్తాగా ,ఉపాధ్యాయునిగా , ఫోర్ మాన్ గా ,సినిమా రచయితగా రకరకాల ఉద్యోగాలు చేసి చివరకు పత్రికా రంగంలో స్థిర పడ్డారు .1931 నుంచి 500 కు పైగా కధలు రాసిన కొ .కు .అభ్యుదయ రచయితగా ,నవలా కారునిగా ,వ్యాసకర్తగా ప్రసిద్ధులయ్యారు .ఆయన వందకు పైగా రేడియో నాటికలూ రాశారు .అశ్వని ,కేయాస్ ,టి .వి .శంకరం వంటి కలం పేరుతొ కూడా ఆయన రచనలెన్నో కనిపిస్తాయి .ఆయన రచనల్లో అనుభవాలకు తప్ప ఊహలకు చోటుండదు .జీవితపు మారుమూలల్లోకి వెలుగు తీసుకు రాలేనిది సాహిత్యం కాదని ఆయన గట్టిగా నమ్మేవారు .కొ .కు .రచనలు జీవితానికి దగ్గరగా వున్నట్టే ,భాష ప్రజలకు దగ్గరగా వుంటుంది .విప్లవ బీజాలు లేని సాహిత్యం ఆలోచనలు రెకెత్తిన్చదని అది సాహిత్యమే కాదని కొ .కు .అంటారు .ఆయన మంచి విమర్శకులు .స్వపర భేదం లేదు .ఇతరుల కంటే ముందే తన లోపాలను తానే ఎత్తి చూపించుకుంటూ వచ్చారు ."సాహిత్యంలో కలగలిసిన మార్పు "అనే వ్యాసమూ ,"ఆర్ధకోపన్యాసాలు "అనే కధ ,"నా అజ్ఞానాన్ధత్వానికి మచ్చు తునకలు ","నేనవలంభించిన వ్యక్తి వాదం వల్ల నా ప్రయోజనం కొనసాగిందేమో కాని సాంఘిక ప్రయోజనం నా కలల్లో మృగ్యమైంది ."వంటి ఆత్మ విమర్శతో కూడిన అభిప్రాయాలను ఆయన తరచూ ప్రకటిస్తూ వచ్చారు .ఆయన రచనల్లో తెలుగుదనం తక్కువని ,పాత్రలు సిద్ధాంతాలు మాట్లాడతాయని వచ్చిన విమర్శల్నికొన్ని స్వీకరించినా ,కొన్నిటిని ఆయన ఎదుర్కొన్నారు ."నేను ఎవరి ఉపయోగం కోసం కధ రాస్తున్నానో వారికా కధ అర్ధం కాకపోవడం నిజంగా నా లోపమే మరి "అంటూ విమర్శను హుందాగా స్వీకరించే అలుపెరుగని రచయిత కొడవటిగంటి కుటుంబ రావు గారు .కనుకనే ఆయన తెలుగు పాఠకులకు అభ్యుదయ భావాలను జీర్ణింప చేసే జరాగ్నిగా నిలిచారు .

*కొ .కు .గారి కుమారుడు కొడవటిగంటి రోహిణి ప్రసాద్ గారు ,వారి బ్లాగులు సైన్స్ , మ్యూజిక్ మనకు సుపరి చితమే .

5 comments:

  1. కుటుంబరావు గారు లేని తెలుగు సాహితీ ప్రపంచాన్ని ఊహించడం చాలా కష్టం! ఆయన రచనలు చదువుతుంటే పారేసుకున్న పెన్నిధి ఏదో దొరికినట్లు ఉంటుంది. ఆ ఫ్లో,ఇక ఎవరికీ లేదు, రాదు కూడా! మాటలు అలా జర్రున జారిపోతూ ఉంటాయి ఆ కలంలోంచి! మారు పేర్లు, సరితా దేవి డైరీ, సరోజ డైరీ, సవతి తల్లి, కొత్త కోడలు, తార,ఇమింగలం వేట, కులం లేనిపిల్ల, ఒకటా రెండా, ప్రతి ఒక్కటీ ఆణిముత్యమే! వాటి విలువ అమూల్యం!

    ReplyDelete
  2. The meeting was held in Tenali:
    http://rohiniprasadk.blogspot.com/2008/12/16-oct-28th-1909-aug-17th-1980-2009.html

    Rohiniprasad

    ReplyDelete
  3. @ నేస్తం ! థాంక్స్ .

    @ సుజాత గారూ ! మరిన్ని రచనలు ప్రస్తావించి నందుకు ధన్యవాదములు .

    ReplyDelete
  4. @ రోహిణి ప్రసాద్ కొడవటిగంటి : సర్ ! సభ గురించి వివరించి బ్లాగ్ లింక్ అందించినందుకు ధన్యవాదములు.

    ReplyDelete