Tuesday, January 25, 2011

మంచి చెడులు రెండూ ... మనకు అవసరమే !


'మృతియె లేకున్న రుచిఏది బ్రతుకులోన '
అన్నారో కవి
చీకటి లేనిదే వెలుగు విలువ తెలీదు
కష్టమనేదే లేకుంటే సంతోషానికి
అర్ధం తెలీదు
ఐనా మన జీవితంలో రోజులన్నీ
ఒకేలా ఆనందంగా సాఫీగా సాగిపోవాలని
కోరుకుంటాం అందరం
కాని అలా జరిగితే జీవితం విలువ
మనకి తెలీకుండానే ముగిసిపోతుందేమో
మంచిరోజు అంటే మనకు ఆనందాన్నిచ్చింది
అనుకుంటాం
కష్టం కలిగిన రోజును ద్వేషిస్తాం
కాని మనం చెడ్డ అనుకున్న రోజు కూడా
మనకు ఓ గుణపాఠం నేర్పుతుంది
అది మనకు తప్పకుండా జీవితంలో
ఉపయోగపడుతుంది
మనల్ని కాపాడుతుంది
కనుక మన జీవితంలో ఏరోజూ
ద్వేషించాల్సినది కాదు
మంచి చెడులు రెండూ ...
మనకు అవసరమే !

Wednesday, January 19, 2011

ముగ్ధ మనోహరి...


ముగ్ధ మనోహరి...ఇలా అనుకోగానే అలనాటి అందాలనటి జమున అలా కళ్ళముందు కదలాడుతుంది.బాలనురా మదనా...అంటూ చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ అభినయించినా, గోదారి గట్టుంది...అంటూ చిలిపిగా అల్లరి చేసినా, సత్యభామగా రుసరుసలాడుతూ వాల్జెడ విసిరినా , మూగనోముతో కన్నీళ్లు పెట్టించినా ఆమెకు ఆమే సాటి!

మాష్టారూ మాష్టారూ...ఈఝుంకీలేలా ఉన్నాయి...మాష్టారూ మరే...అంటూ మిస్సమ్మలో ఆమె అభినయం ముగ్ధ మనోహరమే కదూ!మీరజాలగలడా నాయానతి వ్రతవిధాన మహిమన్....సత్యాపతి...అంటూ ఆమె అభినయిస్తుంటే ఆ కళ్ళల్లోని అతిశయం..దర్పం...గర్వం...వెరసి ఓహో...సత్యభామ ఇలా ఉండేదా అని అనిపించకుండా ఉండదు.తెలుగువారికి కృష్ణుడిగా రామారావుగారు ఎలాగో తెలుగువారి సత్యభామగా జమున ఎప్పటికీ గుర్తుండిపోతుంది . సత్యభామగా ఎంత మెప్పించగలిగిందో రామాలయం ,మూగనోము వంటి సినిమాల్లో కరుణారసప్రధానమైన పాత్రల్లో ప్రేక్షకుల చేత కంటనీరు పెట్టించిన సహజనటి!

తెలుగులోనే కాకుండా ఇతరభాషా చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన నటీమణి ఆమె.హిందీలో ఆమె నటించిన 'మిలన్ 'చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డ్ వచ్చింది.అదేనండీ మన తెలుగులో మూగమనసులు సినిమాలో గౌరీ పాత్ర !
భూకైలాస్ లో మండోదరిగా, గులేబకావళి కధలో యుక్తిమతిగా, గుండమ్మ కధలో సూర్యకాంతం గారాలపట్టి సరోజగా...ఇలా ఏపాత్ర చూసినా ఆమెరూపం అపురూపం! ఆమె నవ్వితే నెలవంక నవ్వినట్టు ఉంటుంది. అందం,అభినయం కలబోసుకున్న ముగ్ధ మనోహరి జమున మన తెలుగువారు గర్వించదగ్గ నటీమణి!

నిజానికి నాకు మహానటి సావిత్రి అంటే చాలా ఇష్టం! ఐతే ఆమె తర్వాత గర్వంగా చెప్పుకోదగ్గ నటి అనిపిస్తుంది జమునగారిని చూస్తే ! మా అమ్మగారికి మాత్రం జమున అభిమాన నటి! అప్పట్లో కధానాయిక ప్రాధాన్యత కల సినిమాలు జమునవి వస్తే అవి ప్లాప్ ఐనా సరే తప్పకుండా చూసేదట!అంత ఇష్టం అమ్మకి జమున అంటే!
ఈమధ్యే మిస్సమ్మ సినిమా చూశా...ఎన్నోసారో గుర్తులేదు జమున చక్కదనాన్ని మీతో పంచుకుందామని ఈటపా !

Sunday, January 9, 2011

గురుర్దేవో.....??


గురువు అంటే అంధకారం తొలగించువాడని చెబుతారు.శిష్యుల అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు కాబట్టే గురువుకు త్రిమూర్తులతో సమానమైన స్థానమిచ్చి పూజిస్తాం.అక్షరాభ్యాసం ఐన వెంటనే పిల్లలకు ...
గురుర్భ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
అంటూ చెప్పించి గురువు బ్రహ్మ , గురువు విష్ణువు ,గురువు మహేశ్వరుడు గురువు సాక్షాత్ పరబ్రహ్మము అట్టి గురువుకు నమస్కారం చేయమంటూ బుద్ధులు గరుపుతాం ....
ఏక ఏవ పరో బంధుః విషమే సముస్థితే
గురు స్సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవేనమః
ఆపదలు కలిగినపుడు సకల ధర్మ స్వరూపుడగు ఎవడు ఆప్తుడై మన ఆపదలను నివృత్తి చేయునో అట్టి గురువుకు నమస్కారం ....
అట్టిగురువులకు శతకోటి వందనం మరి ఆ గురువుల వల్లే ఆపద వస్తే ....
ఆడపిల్లలకు రక్షణ లేకపోతే...పసి పిల్లలకు శిక్షణ పేరిట శిక్షలు వేస్తుంటే ....ఇక గురువులకు వందనాలకు బదులు దండనలే మిగులుతాయి.ఏ చానెల్ పెట్టినా ప్రతి రెండుమూడు రోజులకోసారి కీచక టీచర్ అని...ఆడపిల్లలమీద వేధింపులనీ వింటూంటే మనసుకెంత బాధనిపిస్తుందో చెప్పలేను.వారికి మాత్రం పిల్లలుండరా...వారూ ఎక్కడైనా చదువుతుంటే అటువంటి వేధింపులకు గురైతే అన్న ఆలోచనే రాదా అనిపిస్తుంది . కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన శిష్యుల్ని మలిన మనస్కులై ఎలా చూస్తారు ?
దండం దశగుణంభవేత్ అన్నారు కానీ దానికి ముందు సామ దాన బేధాల్ని పాటించకుండానే ...తమ తమ ఫ్రస్టేషన్లకు పసిపిల్లల్ని బలిపశువుల్ని చేసి చితక బాదుతున్న గురువులూ ఉన్నారు. వారి భవిష్యత్తు కోసమో...లేక తప్పు చేస్తేనో దండిస్తే ఫరవాలేదు చిన్న విషయాలకే ఓర్పును కోల్పోతున్నారు కన్ను, చెవి అని చూడకుండా కొడుతుంటే ఆతర్వాత పిల్లల తల్లితండ్రులు బాధపడాల్సి వస్తోంది.
కొన్నేళ్ళ క్రిందటివరకూ టీచర్లు పిల్లల్ని కొట్టడం , కంట్రోల్లో పెట్టడం సర్వసాధారణం!తల్లితండ్రులు కూడా పిల్లోడు బాగుపడతాడు అని పట్టించుకొనేవారు కాదు కానీ ఇప్పుడు అది పెద్ద నేరమైపోయింది. సహేతుకమైన కారణం ఉన్నా కూడా పిల్లల్ని దండించ కూడదు.తల్లితండ్రులు కూడా పిల్లల్ని కొట్టడం పట్ల ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య పిల్లల్నిదండిస్తే కంప్లైంట్ చేయటానికి ఏదో టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టినట్టున్నారు.బహుశా కొన్నాళ్ళకు తల్లితండ్రులు ఓ దెబ్బవేసినా అమెరికాలోలా టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసే రోజులోస్తాయేమో.
గురువులందరూ ఒకేలా ఉండరు....కీచక గురువులు మాత్రమే కాదు మహాత్ములూ ఉంటారు .ఓ వారం క్రితం అనుకుంటా పేపర్ లో చదివాను వైజాగ్ దగ్గర శ్రీకాకుళంలో అనుకుంటా ...స్టూడెంట్స్ తప్పు చేశారని టీచర్ శిక్షించుకున్నారట!పిల్లలు పశ్చాత్తాప పడ్డారని రాశారు.నిజంగా ఆయన ఆదర్శానికి వందనం!
ఏది ఏమైనా ఎక్కడో కొద్ది శాతం మంది చేసే తప్పులు వెలుగులోకి వచ్చి గురువులకు మాయని మచ్చను మిగులుస్తున్నాయి కాని మనిషికి చదువు చెప్పి సంస్కరించడానికి గురువే లేకపోతే ఆ సమాజాన్ని ఊహించలేం కదా?అందుకే గురువు ఎప్పుడూ పూజనీయుడే....ఏమంటారు?