Sunday, January 31, 2010

రంగుల కళ !!


మాయా బజార్ నిజంగానే ఒక మాయ ! చూస్తున్నంతసేపూ మనల్ని మెస్మరైజ్ చేసే మహాద్భుతం !భారతంలో లేని శశిరేఖా పాత్రను సృష్టించి ఆమె చుట్టూ అల్లిన కాల్పనిక గాధ !అంతే కాదు ఎక్కడా పాండవులు కనిపించని(కల్పిత)భారత ఘట్టం1957 వ సంవత్సరంలో తీసిన ఈసినిమా ఇప్పటికీ ఒక అద్భుతమే !అటువంటి సినిమాని నలుపుతెలులో నుండి రంగులద్దుతున్నారని తెలిసి ఎప్పుడు రిలీజవుతుందాని ఎదురుచూసి మరీ నిన్న చూసేశాను.

మాయాబజార్ గురించిన కధ , తెరవెనుక కధతో సహా ఇక్కడ రాసేశారు రంగుల మాయ..
కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే రంగులద్దటంలో గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్ వారు కృతకృత్యులయ్యారనే చెప్పొచ్చు .చిత్రంలోని" లాహిరి లాహిరి "పాటలో వెన్నెల నీడల్ని సైతం అందంగా చూపించారు .ఈ సినిమాలో హైలెట్ సావిత్రిగారనే చెప్పుకోవాలి .బ్లాక్ &వైట్ లోనే ఎంతో అందంగా కనిపించే ఆమె రంగుల్లో మరీ అందంగా కనిపించారు .అసలు ఆవిడ అలవోకగా తలతిప్పి కనురెప్పలల్లార్చి , చిరునవ్వు నవ్వితే చాలు ఎంతవారలైనా ఆ అభినయానికి దాసోహమనవలసిందే !

ఘటోత్కచుని పాత్రలో ఎస్.వి రంగారావుగారికి ఇప్పటికీ ఎంత ఫాలోయింగ్ ఉందో థియేటర్లో పడిన ఈలలు , చప్పట్లే సాక్ష్యం .అలాగే రమణారెడ్డి గారి కామెడీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు ."సుందరి నీవంటి దివ్యస్వరూపము "రేలంగిగారి పాటకు కూడా హాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది .ఈ సినిమాకి పెద్దా ,చిన్నా తేడా లేకుండా ,ఇంకా వారి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తున్న వారిని చూసి నాకెంత సంతోషంవేసిందో మాటల్లో చెప్పలేను .ఇటువంటి మంచి సినిమాల్ని ప్రజలు ఆదరిస్తే మరిన్ని ఆణిముత్యాల్ని రంగులలో మనముందుకు తెచ్చే సాహసం చేస్తారు.అలాగే ఈ తరం పిల్లలకూ పాండవులు ఐదుగురని , కౌరవులు నూర్గురని ....రామాయణ , మహాభారతాల పట్ల బేసిక్ నాలెడ్జ్ ఏర్పడుతుంది .ఈమధ్య చాలా టీవీ షోల్లో పిల్లల సమాధానాలు చూస్తుంటే బాధ కలుగుతుంది .

ఇక ఈసినిమాలో కృష్ణుని పాత్ర రంగు , ధరించినమాల కొంత డల్ గా అనిపించాయి.ఐతే ఎన్ .టి రామారావుగారి చిరునవ్వు , హావభావాలు యధావిధిగా మన మనసుల్ని దోచుకుంటాయి. ఆద్యంతం కామెడీ పిల్లలనుండి ,పెద్దలవరకూ ఎంజాయ్ చేస్తాం.ఐతే నన్ను నిరాశపరచిన విషయం "చూపులు కలిసిన శుభవేళ "పాటను ఇంకా అక్కడక్కడా కొంత భాగాన్ని కట్ చేసేయడం ! చిత్రం నిడివి తగ్గించే ప్రయత్నంలో అలా జరిగి ఉండొచ్చు కధాపరంగా ఎక్కడా ఆలోటు కనిపించదు .రంగుల మాయాబజార్ పాత సినిమా ప్రియులనే కాదు ఈతరం యూత్ ని కూడా ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.మరి సెలవురోజు ప్రోగ్రాం కన్ఫర్మ్ అయిందా :) :)

Wednesday, January 27, 2010

బంగారు తల్లిని :)


జన్మనిచ్చే మాకు జీవించే హక్కు లేదా?
జ్యోతిగారి టపా చదివినప్పుడు మనసు కలచివేసినట్టైంది.నేనూ ఇటువంటివి టీవీ లో చూసినప్పుడు ,పేపర్లో చదివినప్పుడు బాధపడుతూ ఉంటాను.హోమ్స్ లో ఉయ్యాలల్లో వదిలేసే వాళ్లలోనూ ఎక్కువ శాతం ఆడపిల్లలే ఉంటారు.ఈమధ్య టీవీలో అమ్మకానికి పిల్లలు అని ఒక న్యూస్ చూపించినపుడు కూడా ఎక్కవ ఆడపిల్లల్నే అమ్మకానికి పెడుతున్నారట !ఆడపిల్లని తెలియగానే గర్భస్త శిశువుల్ని చిదిమేసేవారు , ఇప్పుడు ముందే లింగ నిర్ధారణ చేయటం నేరం కాబట్టి పుట్టిన తర్వాత విసిరి పారేస్తున్నారు .పుట్టిన తర్వాత తప్పక పెంచుతూ ఆడపిల్లల్ని చిన్నచూపు చూసేవారు కూడా చాలామంది ఉంటారు .ఇవన్నీ చూస్తుంటే ఇటువంటివారూ ఉంటారా అని ఎంతో బాధగా ఉంటుంది .

ఐతే నేను అదృష్టవంతురాల్ని అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మా నాన్నగార్ని నాకిచ్చినందుకు ! నేను మాత్రమే కాదు కూతుర్ని అపురూపంగా చూసుకొనే తల్లితండ్రులున్న వారందరూ అదృష్టవంతులే !

అందరూ ఆడపిల్లల్ని మొగ్గలోనే తుంచేయక పోయినా ...మగపిల్లాడు కావాలని ముడుపులు కట్టేవారు ,మొక్కుకొనేవారు చాలామందే ఉంటారు .ఐతే మా నాన్నగారికి మాత్రం ఆడపిల్లలంటే చాలా ఇష్టం .ఐతే ముందు అన్నయ్య పుట్టేశాడు .అన్నయ్య పుట్టేసరికి నాన్నగారు ఇంకా ట్రైనింగ్ లోనే ఉండటం వల్ల అమ్మ అమ్మమ్మగారి ఇంటిదగ్గరే ఉండేదట !నాన్నగారు అక్కడికి వెళ్ళినప్పుడు పాలకోసం వచ్చే చిన్నపిల్లల్ని (అమ్మమ్మగారికి పాడి ఎక్కువే ఉండేదట పాలు ,పెరుగు అమ్మటంవల్ల చాలామంది పిల్లలువచ్చేవారట ) ఎత్తుకొని ముద్దుచేసేవారట !వాళ్ళ ముక్కుకారుతున్నా కూడా :) పిన్నిలు ఇప్పటికీ చెప్పి నవ్వుతుంటారు . రెండోసారైనా ఆడపిల్ల పుట్టకపోతుందా అని అనుకొంటే అదేంటో అన్నయ్య పుట్టాక చాన్నాళ్ళు పిల్లలు కలగలేదు .ఇక నాన్నగారు ఒక పాప కావాలని కనిపించిన దేవుడికల్లా మొక్కుకొనేవారట!అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది చెట్టుకి ,పుట్టకి ఆఖరుకి పసుపు పూసిన రాయి కనిపించినా అమ్మవారిగా తలచి మొక్కేవారట .చివరికి అన్నయ్య పుట్టిన పన్నెండేళ్ళకి దేవీ నవరాత్రుల రోజుల్లో నేను పుట్టానట !

ఇక నేను పుట్టింది మొదలు కళ్ళల్లో పెట్టుకొని ఎంతో అపురూపంగా చూసుకొనేవారట అలా నేను నాన్నగారి బంగారు తల్లిని అయ్యానన్నమాట ! పెరిగి పెద్దయ్యాక తెలిసింది అందరూ మా నాన్నగారిలా ఉండరు కొందరు ఇలా చేతులారా ఆడపిల్లల్ని చంపుకోనేవారూ ఉంటారని ! ఏది ఏమైనా ఈ నాన్నని నాకిచ్చినందుకు దేవుడికి సదా కృతజ్ఞురాలిని !మీకూ నాన్న గుర్తుకొస్తున్నారు కదూ ! వెంటనే ఫోన్ అందుకోండి మరి :)

Monday, January 18, 2010

పిట్ట కధలు - 3


పిట్ట కధలు -
పిట్ట కధలు -2 (యయాతి చెప్పిన నీతి )

గత జూన్ లో చెప్పుకున్నపై రెండు కధలు చదివారుగా ! ఇప్పుడింకో చిన్న పిట్టకధ !
కలియుగం ప్రారంభమైంది మానవులు మోక్షం కోసం కాక ధనాపేక్షతో , తమ స్వార్ధ ప్రయోజనాలకోసం లక్ష్మిని పూజించడం మొదలుపెట్టారు .పాలకడలిలో శేషతల్పంపై పవళించిన స్వామి పాదాలు వొత్తుతూ పై విషయం తలచుకొని లక్ష్మీదేవి గర్వంతో నవ్వుకోసాగిందట ! ఐతే స్వామి సర్వాంతర్యామి అమ్మ నవ్వులోని అంతర్ధానం గ్రహించి కూడా ఏమీ ఎరుగనట్టు ఏంటి లక్ష్మి నీలో నీవే నవ్వుకొంటున్నావ్ అని అడిగారు .అప్పుడు లక్ష్మీదేవి స్వామీ! కలియుగ మహిమ చూశారా ?భూలోకంలో ఎక్కడ చూసినా నా భక్తులే ఉన్నారు కాని మోక్షాపేక్షగల మీ భక్తులు అసలున్నారా అని సందేహంగా ఉంది అని గర్వంతో అంటుంది .

అమ్మకు ఎలాగైనా గర్వభంగం చేయదలచి స్వామి దేవీ ! భూలోకంలో నా భక్తులు అన్నికాలాల్లోనూ ఉంటారు కాబట్టే ధర్మం ఒంటిపాదంతో ఐనా నిలబడగలుగుతోంది కాకపొతే కాకులు అన్నిచోట్ల కనిపిస్తాయి నీ భక్తుల్లా ...హంసలు అరుదుగా కనిపిస్తాయి నా భక్తుల్లా అంటూ చమత్కరిస్తారు .

అమ్మకు మనసు చివుక్కుమని కోపంతో మీరు చెప్పినట్లు స్వార్ధంలేని భక్తులు ఎవరైనా ఉంటే చూపించండి వారు ఎటువంటివారో నేను నిరూపిస్తాను అని అంటుంది .స్వామి కాశీ క్షేత్రంలో రామానందుడు అనే మహా భక్తుని చూపించి యితడు వాంచారహితుడు , భక్తిని ప్రజలలో వృద్ధి చేయటం తప్ప వేరే స్వార్ధం లేనివాడు అంటూ చెప్పారు .

లక్ష్మీదేవి రామానందుని పరీక్షింప దలచి అతడు నడిచే దారి పక్కగా ధనరాశులను సృష్టించింది ఐతే హరినామస్మరణ చేసుకుంటూ కనీసం తలకూడా తిప్పిచూడకుండా వెళ్ళిపోయాడు రామానందుడు . అమ్మ పట్టువదలకుండా ఆ మర్నాడు తెల్లవారుఝామున రామానందుడు గంగా స్నానానికి వెళ్ళేదారిలో తన మాయతో అందమైన పుష్పాలతో కూడిన ఒక గులాబీ తోటను సృష్టించింది రామానందుడు స్నానం చేసి వెళ్తూ ఆతోటను చూసి ఆశ్చర్యంతో ఇంత అందమైన పుష్పం శ్రీహరి పాదాల చెంత ఉండతగినది అనుకొని ఒక పుష్పాన్ని కోసి చేతపట్టుకోగానే లక్ష్మి మారువేషంలో వచ్చి ఈ తోట నాది నీవు అనుమతి లేకుండా పుష్పాన్ని దొంగిలించావు అన్నది

తల్లీ !క్షమించు ఇంతఅందమైన పూలు కనిపించగానే భగవానుని పాదాలవద్ద ఉంచాలనిపించి కోసాను అంతేగాని దొంగను కాదు అంటూ ఆ పుష్పాన్ని అమ్మకిచ్చి వెళ్ళిపోయాడు రామానందుడు .లక్ష్మీదేవి ఆ పుష్పాన్ని చేతపట్టుకొని విష్ణుమూర్తిని చేరి చూశారా స్వామీ !మీరు చెప్పిన రామానందుడు ఒక దొంగ ఈ పువ్వే దానికి నిదర్శనం అంటూ ఆ పుష్పాన్ని స్వామికందించింది .

అప్పుడు స్వామి చిరునవ్వుతో దేవీ !పొరపాటు పడ్డావు .ఈ పువ్వు అతడు నాకు సమర్పించాలనే కాని స్వార్ధంతో అపహరించాలన్న ఆలోచన లేదు .నా విగ్రహం ముందుంచాలని కోశాడు కాని అతనికి నాపట్ల గల అపార భక్తి వల్ల నీవే స్వయంగా ఈ పుష్పాన్ని తెచ్చి నాకు సమర్పించావు అన్నారు . లక్ష్మీ దేవి గర్వం తొలగిపోయి స్వామీ అపరాధం మన్నించండి మీ భక్తులు అన్నికాలాల్లోనూ పుట్టి ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతూ ప్రజలను భక్తి మార్గంలో నడిపిస్తూ ఆదర్శ జీవనం సాగిస్తారు అంటూ స్వామితో ఏకీభవించింది .