* అక్కడ ఇంద్ర ధనుస్సులు అల్లిన పందిళ్ళు
అక్కడ వెన్నెల కళ్ళాపి చల్లిన వాకిళ్ళు .
భావుకత బహుశా ఆయన ఇంటి పేరో ఏమో .....
సాహిత్యం వెన్నెల బాటైతే కృష్ణ శాస్త్రి కవిత ఆ మార్గాన పరుగులు తీసే వెండి రథం అంటారు ఆయన సహ కవులూ ,అభి మానులు ......ఎన్ని పాటలు రాశారో ,ఎన్ని కవితామాలికలల్లారో తెలీదు కాని తెలుగు పరిమళమంతా ఆయన కవిత్వంలో గుభాళిస్తుంది .ఆయన కవితావేశం గురించి మాట్లాడేంతదాన్ని కాదు గాని ,అన్నమంతా పట్టి చూడక్కర్లేనట్టు "మేఘ సందేశం "చిత్రం కోసం ఆయన వ్రాసిన ....
ఆకులో ఆకునై , పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై ,నును లేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా .......
ఈ ఒక్క పాటే చాలు మనసు నిండి పోతుంది .వింటుంటే ప్రకృతిలో విలీనమవ్వని హృదయం ఉంటుందా ?
"నేను మానవతా వాదిని , వట్టి హృదయ వాదిని "అని చెప్పుకొనే శాస్త్రి గారు పద్య రచనలు మాత్రమే కాదు ,గద్య రచనలో కుడా దిట్టే నట .ఎల్లప్పుడూ ఆయన చుట్టూ జనం ,కబుర్లు ,సాహితీ విమర్శలూ ,ఇష్టాగోష్టులు ఉండ వలసిందేనట .అటువంటి మహా మనీషి జీవితంలో విషాదం ఊహించలేం .కాని ఆయనకు గొంతుక ఆపరేషన్ అయి స్వర పేటిక తీసేశారని , తర్వాత కూడా ఆయన నోట్ బుక్ ల ద్వారా సంభాషించే వారని చదివి నప్పుడు నా హృదయం ఆర్ద్రమై పోయింది .మీ అందరికి తెలిసే వుండొచ్చు కాని భారమైన హృదయపు ఆవేదన పంచుకోవాలన్న ఆరాటంతో
వ్రాస్తున్నా .......
గొంతుకు ఆపరేషనై నప్పుడు బొంబాయి హాస్పటల్ లో ఆయన వ్రాసిన ఓ కవిత ......
**నా మందిర గవాక్షంలో నుంచి
తొలి అరుణ స్వర్ణ కాంతి వచ్చి
నా రెప్పలను తాకినప్పుడు
కళ్లు విప్పి స్వాగతం చెప్తాను
వేకువ గాలి ముని వేళ్ళతో
నా మొగం నిమిరి నప్పుడు
చిరునవ్వు నవ్వుతాను
పెరటిలో నుంచి కొత్తగా విరిసిన
విభాత సుమ పరిమళం వచ్చి
పలకరిస్తే ' ఔ 'నని తల ఊపుతాను .
కాని ........గవాక్షం లోనికి ,రవ్వంత ఒరిగిన
మావి కొమ్మ చివర నిలిచి
'కో ' అన్న వనప్రియారవానికి
బదులు మాత్రం చెప్పలేను ,
ఇక ...........బదులు మాత్రం చెప్పలేను .
*నిందించదానికీ ,కీర్తించడానికి కాదు .మానవుని మానవునిగా చేయడానికే కావ్య నిర్మాణ మట! ఆ నిర్మాణానికి రాళ్లెత్తిన ,రంగులద్దిన కవులకూ ,భావుకులకూ ......... నా వినమ్ర పూర్వక వందనములు .