
పల్లెల్లో ఉత్సవాలప్పుడు వసంత నవరాత్రులు , గణపతి నవరాత్రులు , దేవీ నవరాత్రులు ...ఇలా ఉత్సవాలు జరిగినప్పుడు ఆలయాల్లో రాత్రివేళ ఏవైనా కార్యక్రమాలు పెట్టటం జరుగుతుంది ..వాటిలో ఓ రోజు తప్పకుండా హరికధ పెట్టిస్తారు .ఆ హరికధ చెప్పే భాగవతార్ లేదా భాగవతారిణి చెప్పే అసలు కధ కంటే కొసరుగా చెప్పే కధలే ఈ పిట్టకధలన్నమాట !
సుష్టుగా భోజనం చేసి చేరతామేమో గుడికి ...కధ మొదలైన కాస్సేపటికే కునికి పాట్లు వచ్చేస్తాయి ..అప్పుడు హరికధాగానం మధ్యలో ఘాట్టిగా హరినామస్మరణ చేయిస్తారు మన భాగవతార్ గారు. ఆ తర్వాత ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా పిట్ట కధ హాస్యాన్ని జోడించి మొదలెట్టగానే కాస్తో కూస్తో ఉన్న మత్తు వదిలిపోతుందన్న మాట !
అటువంటి పిట్టకధలను నేను విన్న కొన్నిటిని మీతో పంచుకోవాలని ఈ టపా ! ఇవి మీక్కూడా తెలిసినవే అయి ఉంటాయి ఐనా మరోసారి గుర్తుచేసుకుంటారు కదూ !
ఇప్పుడొక బుల్లి పిట్టకధ !
అనగనగా ఓ మూర్ఖుడు ...వాడు ఎన్నడూ దైవనామ స్మరణే చేసేవాడు కాదు .ఒకరోజు వాడికి చెట్టు చిటారు కొమ్మ ఎక్కి ఊరు చూడాలనే బుద్ధి పుట్టింది .వెంటనే ఊరిచివర ఉన్న ఓ పెద్ద చెట్టు చివరికంటా ఎక్కేశాడు ...కానీ కొమ్మ బలహీనంగా ఉండటం వల్ల విరిగి పడిపోతూ కాస్త పట్టు ఉండి వేళ్ళాడుతూ ...ఓయ్ ..ఎవరైనా ఉన్నారా ...పడిపోతున్నా ...అంటూ అరవ సాగాడు.కానీ ఊరు శివారు ప్రాంతం వల్ల ఎవ్వరూ పలకలేదు .
పార్వతీ పరమేశ్వరులు భూలోకాన్ని వీక్షిస్తూ ఉండగా ఈ దృశ్యం వారి కళ్ళబడింది .పార్వతీ దేవికి జాలి కలిగి ఎంతైనా తల్లి మనసు కదా ...పరమేశ్వరుడ్ని స్వామీ అతడ్ని కాపాడండి అని అడిగింది .అప్పుడు స్వామి ..దేవీ ..ఇతడు మూర్ఖుడు ..పుట్టి బుద్ధెరిగాక దేవుడ్ని ఒక్కసారి కూడా తలచలేదు ...ఎవ్వరికీ సాయపడిందీ లేదు ఐనా నువ్వు అడిగావు కాబట్టి ఒక పని చేద్దాం ...పడేటప్పుడు అమ్మా అని పిలిచాడనుకో ...నువ్వు కాపాడు ...అయ్యా అంటూ పడితే నేను కాపాడతాను అన్నాడు చిరునవ్వుతో ....ఎవరైనా రెండిట్లో ఏదోకటి అంటారు కదాని సరే అంది అమ్మవారు .
ఈలోగా కొమ్మ విరిగి పడిపోసాగాడా మూర్ఖుడు .పడిపోతూ బాబోయ్ .....అంటూ అరిచాడు . శివ పార్వతులు మూర్ఖుడ్ని మనం కూడా బాగు చేయలేం అనుకుంటూ నిష్క్రమించారు .








