Saturday, June 13, 2009

పిట్ట కధలు -1


పల్లెల్లో ఉత్సవాలప్పుడు వసంత నవరాత్రులు , గణపతి నవరాత్రులు , దేవీ నవరాత్రులు ...ఇలా ఉత్సవాలు జరిగినప్పుడు ఆలయాల్లో రాత్రివేళ ఏవైనా కార్యక్రమాలు పెట్టటం జరుగుతుంది ..వాటిలో ఓ రోజు తప్పకుండా హరికధ పెట్టిస్తారు .ఆ హరికధ చెప్పే భాగవతార్ లేదా భాగవతారిణి చెప్పే అసలు కధ కంటే కొసరుగా చెప్పే కధలే ఈ పిట్టకధలన్నమాట !

సుష్టుగా భోజనం చేసి చేరతామేమో గుడికి ...కధ మొదలైన కాస్సేపటికే కునికి పాట్లు వచ్చేస్తాయి ..అప్పుడు హరికధాగానం మధ్యలో ఘాట్టిగా హరినామస్మరణ చేయిస్తారు మన భాగవతార్ గారు. ఆ తర్వాత ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా పిట్ట కధ హాస్యాన్ని జోడించి మొదలెట్టగానే కాస్తో కూస్తో ఉన్న మత్తు వదిలిపోతుందన్న మాట !

అటువంటి పిట్టకధలను నేను విన్న కొన్నిటిని మీతో పంచుకోవాలని ఈ టపా ! ఇవి మీక్కూడా తెలిసినవే అయి ఉంటాయి ఐనా మరోసారి గుర్తుచేసుకుంటారు కదూ !

ఇప్పుడొక బుల్లి పిట్టకధ !
అనగనగా ఓ మూర్ఖుడు ...వాడు ఎన్నడూ దైవనామ స్మరణే చేసేవాడు కాదు .ఒకరోజు వాడికి చెట్టు చిటారు కొమ్మ ఎక్కి ఊరు చూడాలనే బుద్ధి పుట్టింది .వెంటనే ఊరిచివర ఉన్న ఓ పెద్ద చెట్టు చివరికంటా ఎక్కేశాడు ...కానీ కొమ్మ బలహీనంగా ఉండటం వల్ల విరిగి పడిపోతూ కాస్త పట్టు ఉండి వేళ్ళాడుతూ ...ఓయ్ ..ఎవరైనా ఉన్నారా ...పడిపోతున్నా ...అంటూ అరవ సాగాడు.కానీ ఊరు శివారు ప్రాంతం వల్ల ఎవ్వరూ పలకలేదు .

పార్వతీ పరమేశ్వరులు భూలోకాన్ని వీక్షిస్తూ ఉండగా ఈ దృశ్యం వారి కళ్ళబడింది .పార్వతీ దేవికి జాలి కలిగి ఎంతైనా తల్లి మనసు కదా ...పరమేశ్వరుడ్ని స్వామీ అతడ్ని కాపాడండి అని అడిగింది .అప్పుడు స్వామి ..దేవీ ..ఇతడు మూర్ఖుడు ..పుట్టి బుద్ధెరిగాక దేవుడ్ని ఒక్కసారి కూడా తలచలేదు ...ఎవ్వరికీ సాయపడిందీ లేదు ఐనా నువ్వు అడిగావు కాబట్టి ఒక పని చేద్దాం ...పడేటప్పుడు అమ్మా అని పిలిచాడనుకో ...నువ్వు కాపాడు ...అయ్యా అంటూ పడితే నేను కాపాడతాను అన్నాడు చిరునవ్వుతో ....ఎవరైనా రెండిట్లో ఏదోకటి అంటారు కదాని సరే అంది అమ్మవారు .

ఈలోగా కొమ్మ విరిగి పడిపోసాగాడా మూర్ఖుడు .పడిపోతూ బాబోయ్ .....అంటూ అరిచాడు . శివ పార్వతులు మూర్ఖుడ్ని మనం కూడా బాగు చేయలేం అనుకుంటూ నిష్క్రమించారు .

Wednesday, June 3, 2009

మీకు తెలుసా ?


చాలా యుగాల క్రిందటి మాట ! క్షీర సాగర మధనం జరిగింది . శ్రీ మహా విష్ణువు మోహినీ రూపంతో అమృతాన్ని దేవతలకు పంచేశాడు . రాక్షసులు అది మనసులో పెట్టుకొని తమ వర గర్వంతో , కామరూప విద్యలతోనూ ..దేవతలమీద దండ యాత్రలు చేశారు .ఐతే విష్ణు మాయ వల్ల ఎప్పుడూ చివరికి దేవతలే గెలిచేవారనుకోండి ...ఇక మన విషయం లోకి వస్తే ...

పై కధంతా తెలిసిన మానవుడొకడు ...తీవ్ర తపస్సు చేశాడు . అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఎందుకు మానవా ఇంత తీవ్ర తపస్సు చేస్తున్నావ్ ? అని అడిగాడు .
మానవుడు ..స్వామీ దేవతలకు ...అమృతాన్ని ఇచ్చారు ...రాక్షసులకు కామరూప విద్యలన్నీ తెలుసు ...కాని మా మానవులకు అన్యాయం జరిగింది .కనుక మాక్కూడా అమృతాన్ని రుచి చూసే భాగ్యం కలగచేయండి . అని ప్రార్ధించాడు .

అప్పుడు బ్రహ్మ దేవుడు ...నాయనా అమృతాన్ని మీకిస్తే దేవతలకూ , మానవులకూ తేడా లేకుండా పోతుంది ..మానవులకు జరా మరణాలు తప్పనిసరి కదా ! కనుక అమృతం తో సరిసమానమైన రుచి కలిగిన దానిని మీకు వరం గా ఇస్తున్నాను తీసుకో అంటూ అతని చేతిలో ఒక పండు జార విడిచాడు .

మానవుడు మహా ప్రసాదంగా కళ్ళకద్దుకొని ఆ ఫలాన్ని ఆరగించి దాని రుచికి మైమరచి పోయి ...ఆహా ..ఈ ఫలాన్ని మన ముందు తరాలవారందరూ ఆరగించాలని ....ఆలోచించి ..ఆ విత్తనాన్ని భూమిలో పాతాడు .దానినుండి వచ్చిన మొక్క ...మానై ...కాయలు కాసింది .ఆ కాయలు ఇప్పటికీ ప్రతి వేసవిలోనూ నోరూరిస్తూ మనముందుకొస్తున్నాయి.

ఆ రోజు బ్రహ్మ ఇచ్చిన పండే ఈ రోజు మనం అందరం ఇష్టపడి తినే మామిడి పండు అన్నమాట !

** కధ చదివిన వారంతా క్షమించాలి ! ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది ఇది కల్పితమని !
మామిడిపళ్ళు అంటే నాకు ప్రాణం !మా వాళ్లు అందరూ వెక్కిరిస్తారు నీ అంత మావిడి పళ్ళ పిచ్చి ఎవరికీ ఉండదని !
అలా వెక్కిరించిన వారికి నేను చెప్పే కల్పిత గాధ ఇది ...కనుక మీరూ సరదాగా తీసుకుంటారు కదూ .... :)

Monday, June 1, 2009

చిట్టితల్లీ......( కవిత )


చిట్టితల్లీ ! వెళ్ళిపోయావా ?
అమ్మ ఒడిలోకి రాకముందే ...
ఈ లోకపు కుళ్ళును చూడలేక
ఆడపిల్లవని అలుసు చేస్తామని ..
చదివినంత చదువు చెప్పించమేమోని
చెప్పించినా ...అల్లరిమూకల
ఆకలి చూపుల కెరకాలేక
ప్రేమోన్మాదుల యాసిడ్ దాడుల భయంతో
అనుమానపు చూపుల అవహేళన
తట్టుకొని నిలువలేక ...
అత్తవారింట వరకట్నపు కోరలకు
ఆహుతి కాలేక ...కన్నవారి
కడుపులో చిచ్చు పెట్టలేక
ముందుగానే వెళ్ళిపోయావా
చిట్టితల్లీ .....
చుక్కల లోకంలో మబ్బుల
తూగుటుయ్యాలలో .....
ఊయలలూగేందుకు హాయిగా ......

Thursday, May 28, 2009

ఆరంభ శూరత్వం !


చిన్నప్పుడు అంటే ఇంకా స్కూల్ లో వెయ్యకుండానే ..నాన్నగారు చెప్పిన పాటలూ ..పద్యాలూ ...చిలకపలుకుల్లా పలకటం చూసి కూతురు ప్రతిభకి మురిసి పోయి ఒక సవత్సరం ముందే నన్ను స్కూల్ లో వేసేయ్యడానికి నిర్ణయించేసుకున్నారు అమ్మ నాన్నగారునూ ...వయసుదేముందిలే (అప్పట్లో బర్త్ సర్టిఫికేట్ అడిగేవారు కాదనుకుంటా ) ఒక సంవత్సరం ఎక్కువ వెయ్యొచ్చు అనుకున్నారు .

అప్పుడు మేముండే ఊర్లో ఒకే ఒక ఇంగ్లీషు మీడియం కాన్వెంటు ఉండేది .సరే కూతురు ఏ కలెక్టరో ...డాక్టరో ...అయిపోవాలని ముచ్చటపడిపోయి ఒకేడు ఎక్కువ వయసు వేయించి మరీ కాన్వెంట్ లో జాయిన్ చేశారు .సరే ఎదురు చూసిన రోజు రానే వచ్చింది .ఆ రోజే నేను మొదటిసారిగా స్కూల్ కి వెళ్ళటం .అమ్మ చక్కగా తయారు చేసింది .నా పుస్తకాల పెట్టె ( అప్పట్లో ఇండాలియం బాక్సులు ఉండేవి ) తోపాటూ ....మరో బుట్ట ! దాంట్లో లంచ్ బాక్స్ ,వాటర్ బోటిల్ తోపాటూ స్నాక్స్ బాక్స్ , జూస్ బోటిల్ , ఇంకా పాల ఫ్లాస్క్ ...సరంజామా సిద్ధం . ఇంతకూ స్కూల్ మూడు గంటల వరకే ! సరే ఇక స్కూల్ కి వెళ్ళాకా ..అక్కడ టీచర్ కీ ...ఆయాకీ ...నన్ను అప్పగించి ..పొద్దుట ఇంటెర్వల్ లో పాలు , బిస్కెట్ లూ ....మద్యాహ్నం లంచ్ , తర్వాతి ఇంటెర్వల్ లో జూస్ ఇవ్వాలని అన్ని జాగ్రత్తలూ ఆయాకి చెప్పి ..కొద్దోగొప్పో ఆమెకి లంచమిచ్చి మంచి చేసుకొని వదల్లేక వదిలి వెళ్ళారు నాన్నగారు . ఇక్కడ మీలో ఆకాశమంత సినిమా చూసిన వారంతా
ప్రకాష్ రాజ్ ను గుర్తు తెచ్చుకోవాల్సిందే !

నా సరంజామా చూసిన వాళ్ళకి నేను చదువుకోడానికి వెళ్తున్నానా ...లేక తినటానికి వెళ్తున్నానా అనిపిస్తే అది వాళ్ల తప్పు కాదు మరి ! ప్రతి రోజూ నాన్నగారు దింపడం ( రిక్షాలు ఉండేవి కానీ తనే దింపేవారు) ...ఆయాకు అన్ని జాగ్రత్తలతో అప్పగించడం జరిగేది .సరే మనం కూడా శ్రద్ధగా A B C D లు దిద్దడం నుంచి ...మెల్లగా రైమ్స్ ,చిన్న చిన్న పదాల్లోకి వస్తున్నాం .ఈలోగా ఒక విషయం ఇంట్లో తెలిసి పోయింది .

నా దురదృష్టవశాత్తూ ...మా ఆయాకి ఓ కొడుకున్నాడు .వాడెప్పుడూ వాళ్లమ్మతోనే ఉండేవాడు .మన బుట్టంత నిండుగా ఏ బుట్టా వచ్చేది కాదేమో ..నన్ను ప్రత్యేకంగా ఓ ప్రక్కన కూర్చోబెట్టి తినిపించేది . తినిపిస్తూ నాకు రెండు ముద్దలు పెట్టడం ఇంక చాలా ..అని అడగటం ...మనకేం తెలుసు చాలు అనగానే మిగతా అన్నం కొడుక్కి పెట్టేయడం .అలాగే పాలు తాగుతావా ... నేను తాగను అనగానే వాడికి ఇచ్చేయటం ...జూస్ కూడా అంతే అమ్మ కష్టపడి పంపిస్తే నేను తాగేది రెండు సిప్ లు . కొన్నాళ్ళకు ఇంటర్వెల్ లో స్నాక్స్ బాక్స్ ఖాళీగా ఉండేది .

కొన్నాళ్ళు గడిచాక ...రోజు రోజుకీ చదివేసి చిక్కిపోతున్నానా ..లేకపోతె ఏంటీ ...అని అమ్మ ఒక రోజు కూర్చోబెట్టి బుజ్జీ ! అన్నం తింటున్నావా ?జూస్ తాగుతున్నావా ....అని బుజ్జగించి అడిగే సరికి ....మరే ..పాపం ..ఆయా వాళ్ల అన్నయ్యున్నాడు కదా ( వాళ్ల అబ్బాయి ) ....వాడు తినాలికదా ..అందుకే నేను చాలు అంటున్నానన్నమాట !అనేసింది బుజ్జి ...అదేనండీ ...నేను !

అంతే ఆ తర్వాత నాన్నగారు స్కూల్ కి వచ్చి ఆయాతో గొడవ పెట్టుకొని ...టీచర్ కి కంప్లైంట్ చేశారు . స్కూల్ మేనేజ్ మెంట్ అక్కడ ఉండేవారు కాదు .టీచర్ లేమో పట్టించుకోలేదు .దానితో నాన్నగారు గొడవ పెట్టుకొని స్కూల్ మానిపించేశారు . వేరే స్కూల్ లో వేద్దామని అనుకోని సంవత్సరం వేస్ట్ అవకుండా విరజాజి పూలు ....
టీచర్ గారి దగ్గర ట్యూషన్ పెట్టి తెలుగు అక్షరాలు నేర్పించి ...ఆ తర్వాతి సంవత్సరం తెలుగు మీడియం అంటే బోర్డు స్కూల్లో చేర్చారు .

అంత హడావుడిగా మొదలైన నా చదువు స్కూల్ ఫైనల్ పూర్తవ కుండానే ఆగిపోయిందనుకోండి .ఎందుకనేది మరో టపాలో.....

* పై బొమ్మ లో ఉన్నది నేను కాదు .బుజ్జి కి కాస్త దగ్గరి పోలికలున్నాయని పెట్టాను ... :) :)

Tuesday, May 26, 2009

పునరపి జననం !!( కవిత )


మానవ జన్మం భగవంతుని వరం
వినమ్రుడవై స్వీకరించు ....
జీవితం అంతులేని ప్రయాణం
అలుపెరుగక పయనించు ....
దేవుని సృష్టి ఒక అద్భుతం
ఆ అందాన్ని ఆస్వాదించు...
పరోపకారార్ధ మిదం శరీరం
సాటి ప్రాణులపట్ల దయఉంచు...
మృత్యువొక శాశ్వత సుఖం
ఎదురాడక తలవంచు ....
తప్పనిసరి మరుజన్మం
ఇదేకదా గీతాసారాంశం !

* ఈ కవితకు శీర్షిక సరైనదో ..లేక ఈ శీర్షిక పెట్టె అర్హత కవితకు ఉందొ లేదో ..అన్న సందేహంతో ఈ టైటిల్ పెట్టటం జరిగింది. మీ సూచనలు కోరుతున్నాను .

Saturday, May 23, 2009

నాన్నచెప్పిన కధలు -2


అనగనగా మన దేశాన్ని నవాబులు పాలించే రోజుల్లో ....
ఓ రాజ్యాన్ని పాలించే నవాబు గారికి 14 భాషలు వచ్చు .చాలా శౌర్యమూ , తెలివీ అన్నీ ఉన్నా ఆయనకు ఒక బలహీనత ఉండేది .అది ఆయనకు కధలంటే విపరీతమైన పిచ్చి . ఎంతంటే రాజ్యపాలన కూడా పట్టించుకోకుండా రోజంతా కధలు వింటూ కాలం గడిపేవాడు .ఎన్ని కధలు విన్నా ఆయనకు తృప్తి ఉండేది కాదు . తనకు వచ్చిన 14 భాషల్లో ఏ భాషలోనైనా తను విసుగొచ్చి ఆపమనేంత వరకు కధలు చెప్పగలిగిన వారికి లక్ష దీనారాలు బహుమతి అనీ ...అలా చెప్పలేక పొతే 100 కొరడా దెబ్బలు శిక్ష అనీ రాజ్యంలో ప్రకటన చేయించాడు .ఎంతోమంది కవులూ ,పండితులూ నవాబుగారి దీనారాలకు ఆశపడి రావడమూ ....ఆయన్ను మెప్పించలేక శిక్ష అనుభవించి వెనుతిరగటమూ జరిగేది .

ఇదిలా ఉండగా రాజ్యంలో వర్షాలు కురవక కరువు తాండవించసాగింది.పంటలు పండకపోయినా పన్నులు కట్టవలసి రావడం నవాబుగారు ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా కధలతో కాలక్షేపం చేయడంతో రాజ్యం అస్తవ్యస్తమై పోయింది . మధ్యలో అధికారులూ , భటులూ ప్రజల వద్ద అందిన కాడికి దోచుకునేవారు .ప్రజలంతా అన్నమో రామచంద్రాని అలమటించే పరిస్థితి వచ్చింది .

ఆ రాజ్యంలోని ఓ కుగ్రామంలో ఒక రైతు ఉండేవాడు .తనకున్న నాలుగెకరాలూ పండించుకుని భార్యా పిల్లలతో హాయిగా కాలం గడిపేవాడు . కరువు ...రాజభటుల పన్నుల వసూళ్ళతో కుటుంబం ఆకలితో పస్తులుండే పరిస్థితి వచ్చింది . ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించుకోవాలని రాజధానికి పనివెతుక్కుంటూ వెళ్ళాడు ఆ రైతు . అక్కడ రాజుగారి ప్రకటన గురించి తెలుసుకున్న రైతు స్వతహాగా తెలివైన వాడవటం చేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా తమ రాజ్యాన్ని కూడా రక్షించుకోవాలని అనుకున్నాడు .

నవాబుగారు దర్బారులో కొలువై ఉండగా తాను కధ చెప్పటానికి వచ్చానని రైతు చెప్పగానే రాజుగారితో సహా సభికులంతా హేళనగా నవ్వారు . మహా పండితులే నవాబుగారికి విసుగు తెప్పించలేకపోయారు ఇతనెలా ఆయన చేత ఇక చాలనిపిస్తాడని ఆశ్చర్యపోయారు .నవాబుగారు సరే కానీ శిక్ష తెలుసుకదా ....నాకు విసుగోచ్చేవరకూ చెప్పలేకపోతే 100 కొరడా దెబ్బలు అన్నారు . రైతు తెలుసు ప్రభూ ..కాని నేను మీకు విసుగు వచ్చేవరకూ కధ చెప్పగలిగితే మాత్రం మీరు ఇంకెప్పుడూ కధలు వినకూడదు అన్నాడు .అతని ధైర్యానికి సభంతా నిర్ఘాంత పోయినా నవాబుగారు చిరునవ్వుతో ఒప్పుకున్నారు ధీమాగా తనకు విసుగొచ్చినప్పుడుకదాని ...

రైతు కధ చెప్పటం ప్రారంభించాడు .అనగనగా ఓ ఊరు . ఆ ఊరి చివర ఒక పెద్ద మర్రిచెట్టు . ఆ చెట్టుకు లెక్కపెట్టలేనన్ని ఆకులు ....నవాబుగారు ...ఫిర్ ....అన్నారు .ప్రతీ ఆకు మీదా ఓ కొంగ ..అన్నాడు రైతు ....ఫిర్ ...అన్నారు నవాబుగారు.ఒక ఆకుమీది కొంగ తుర్ మని ఎగిరి పోయింది అన్నాడు ఆయన తిరిగి ..ఫిర్ ..అన్నారు ...రైతు ఇంకో ఆకుమీద కొంగ తుర్ మని ఎగిరిపోయింది అన్నాడు . మళ్ళీ నవాబుగారు ..ఫిర్ ..అనటం ...తిరిగి రైతు తుర్ ..అనడమూ ..ఇలా చాలాసేపు జరిగాక నవాబుగారు అడిగారు ఇంకా ఎంతసేపు ఎగిరిపోతాయి అని ..లెక్కలేనన్ని ఆకులు కదా ప్రభూ ..ఈ రోజు పూర్తవ్వచ్చు.. రేపు పూర్తవ్వచ్చు ..లేదా వారం తర్వాత పూర్తవ్వచ్చు ...అన్నాడు .ఎన్నిసార్లు తాను ఫిర్ అన్నా తిరిగి అతను తుర్ అనే అంటాడని అర్ధమై పోయింది ....నవాబుగారికి విసుగుపుట్టసాగింది.ఇక చేసేది లేక ఇంక చాలు ఆపు అన్నారు .

అప్పుడు నవాబుగారు రైతు తెలివిని మెచ్చుకొని తాను ప్రకటించిన బహుమతితో పాటూ ..తన కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చారు . అంతేకాదు రైతు ద్వారా రాజ్యం లోని పరిస్థితులు తెలుసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ...దళారులను శిక్షించి ...ఆదర్శవంతంగా పరిపాలించారు.

* తెలివైనవారు ఎప్పుడూ తన తెలివిని తమ స్వార్ధం కోసం మాత్రమే కాకుండా సాటివారికోసం కూడా ఉపయోగిస్తే అందరూ బావుంటారు .

Wednesday, May 20, 2009

అశ్రువు ...( ఓ బుల్లి కవిత )


నేస్తం !
నీ కన్నుల్లో పుట్టి ...
నీ చెక్కిలిపై జారి ...
నీ పెదవులపై జీవించి ...
హృదయం పై మరణిస్తే .....
క్షణ కాలమైతేనేం ?
నీకు సాంత్వన కలిగితే
నా జన్మ ధన్యం !