Saturday, March 14, 2009

మేక నాది ..........


అనగనగా ఒక ఊరు .....ఆ ఊరిలో రామయ్య ఓ సన్నకారు రైతు . అతడికి అదే ఊరి చివర ఆశ్రమం లో నివసిస్తున్న సాధువు అంటే ఎనలేని భక్తి . అతడు చెప్పే ప్రవచనాలంటే గౌరవం ....అవి వినడం కోసం రోజూ ఆశ్రమానికి వెళ్తూవుండేవాడు .ఆ సాధువు కూడా గ్రామస్తులకు మంచి , చెడ్డ బోధిస్తూ .....వారు పండో , పత్రో ఏదిస్తే అది ఇచ్చిన్నాడు తింటూ , లేన్నాడు పస్తుంటూ కాలం గడిపేవాడు .

ఒక
రోజు గ్రామస్తులలో ఓ వ్యక్తి సాధువుకు భక్తితో ఒక మేకను కానుకగా ఇచ్చాడు .సాధువు గారు సంతోషించారు .ఆ రోజు నుండీ అది ఆశ్రమం చుట్టు ప్రక్కల గడ్డి మేస్తూ బాగా పాలు ఇచ్చేది .వర్షాకాలం అయినా ,జనం రాకపోయినా ....మేక ఇచ్చే పాలతో హాయిగా కాలం గడిపెసేవారు సాధువు గారు .

ఇలా వుండగా ..ఒక రోజు రామయ్య కొడుకు హఠాత్తుగా మరణించాడు . రామయ్య తీవ్రమైన వేదనతో కృంగిపోయాడు .అయినా అలాగే ఏడుస్తూ సాధువు దగ్గరకు వెళ్ళాడు . విషయం తెలుసుకున్న సాధువు ,....రామయ్యా ! పుట్టిన వారు మరణించక తప్పదు ...మరణించినవారు తిరిగి పుట్టక తప్పదు .ఈ శరీరమేనయ్యా నాశనమయ్యేది , ఆత్మకు చావు లేదు .జీవి శరీరం లో వున్నంత వరకేనయ్యా బంధాలు ,బంధుత్వాలూ .....ఇదే సృష్టి ...అంటూ కృష్ణ భగవానుడు గీతలో చెప్పిన సారాంశాన్ని బోధిస్తాడు .రామయ్య మనసు తేలికపడింది .సాధువు గారికి కృతజ్ఞతలు చెప్పి ,యధావిధిగా తన పనుల్లో మునిగి పోయాడు .

ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాయి .ఒక రోజు రామయ్య వెళ్ళేసరికి సాధువు భోరున ఏడుస్తూ కనిపించాడు .స్వామీ ! ఏమైంది ? ఎందుకు ఏడుస్తున్నారు ? అంటూ అడిగాడు రామయ్య . అప్పుడు సాధువు ....రామయ్యా !నా మేక చచ్చిపోయిందయ్యా , చక్కగా పాలిచ్చేది , నా కడుపు నింపేది ...ఇప్పుడది చచ్చిపోయింది ....అంటూ ఏడ్వసాగాడు .
అదేంటి స్వామీ ! ఇందులో ఏడవాల్సిందేముంది ? మేక ఈ శరీరాన్ని వదిలి , వేరే శరీరం ధరిస్తుంది . అంతేగా ! ఆత్మ నాశనం లేనిది కదా స్వామీ !ఆ రోజు నా కుమారుడు చనిపోయినపుడు మీ దయవల్లే ఇవన్నీ తెలుసుకున్నాను . దీనికి మీరు ఏడుస్తున్నారేంటి స్వామీ ! అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రామయ్య .

అయ్యా ! రామయ్యా ! ఆ రోజు చనిపోయింది నీ కొడుకు . కానీ ఇప్పుడు చనిపోయిన మేక నాది .......అన్నాడు సాధువు భోరున ఏడుస్తూ .......
*ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు ......తనదాకా వస్తే .......

***ఎప్పుడో చదివిన కధ కాస్త అటూ ఇటూ గా ....

9 comments:

  1. సత్యం చెప్పారు. తనదాక వస్తే కాని తెలియదు.
    ఎంఫథిక్ గా ,అంటే ఎదుటి వారి స్తానం లో ఉండి ఎంతమంది అలోచిస్తారు చెప్పండి.

    ReplyDelete
  2. *ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు ......తనదాకా వస్తే .......
    అంతేకదా మరి.

    ReplyDelete
  3. పరిమళం! చాలా చక్కగా చెపారు :)

    ReplyDelete
  4. కరెక్ట్ గా చెప్పారు... ఎదుటివాడికి చెప్పేందుకే నీతులు!

    ReplyDelete
  5. నీతి వేరు,తత్వం వేరు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు తాత్వికమైన మాటలు చెబుతాం.
    మనకు కష్టం వచ్చినప్పుడు అలాంటి మాటలే ఎదురుచూస్తాం.
    తత్వం చెప్పే వారంతా వారికి కష్టాలు వస్తే బాధ పడరని కాదుగా !
    అర్ధం చేసుకోండి.

    ReplyDelete
  6. @ మురళి గారు ,
    @ సూర్యుడు గారు ,
    @ అరుణాంక్ గారు ,
    @ విజయ మోహన్ గారు ,
    @ శృతి గారు ,
    @ చైతన్య గారు ,
    అందరికీ ధన్యవాదాలు .

    @ జయచంద్ర గారు ,మనం పాటించని దానిని ఇతరులకు చెప్పటం ,అందునా ఆయన సర్వ సంగ పరిత్యాగి ....ఒక మేక కోసం దుఃఖించడం అంటే మహాత్ములకది తగదు కదండీ .మీ స్పందనకు ధన్యవాదాలు .

    ReplyDelete