"బాల్యం ఓ తీపి జ్ఞాపకం" కవిత రాసినపుడు కొత్తపాళీ గారు తల్లితండ్రుల చిన్నతనం గురించి తెలుసా అని అడిగారు .అమ్మా నాన్నల చిన్నతనం గురించి చెప్పాలంటే ...చిన్న నవలవుతుందేమో ( మాకు చెప్పినవి మాత్రం ). తరానికి తరానికి బాల్యం లోని అనుభూతుల్ని కోల్పోతున్నామేమో అనిపిస్తుంది .
అమ్మా నాన్నలు ....వారు మనకు కధలు కధలుగా చెప్పే వారి బాల్యం మన పిల్లల్ని ఆశ్చర్య పరిచే నిజం .కొన్ని తరాల తర్వాతి పిల్లలకు నమ్మలేని నిజం .
మా అమ్మా నాన్నలు చిన్నప్పటి విషయాలు చాలా చెప్పినా .....నేను నాకు నచ్చిన ఒక విషయం ప్రస్తావించ దలచుకున్నాను .అది .....పంచుకోవడం .....అవును ...పంచుకోవడమే ....దానివల్ల పెరిగే ఆప్యాయత ,సాయం చేసే మనస్తత్వం అలవడటం ....వింటూవుంటే ఎంతో బావుండేది .
అప్పట్లో ప్రతీ ఇంట్లోనూ ఐదు లేక ఆరుగురు ...ఇలా అధిక సంఖ్యలో సంతానం ఉండేది .అక్కా చెల్లెళ్ళు పూలను అందరూ కలిసి కట్టుకొని తలా ఓ ముక్క తుంపి పెట్టుకోవడం , అన్నదమ్ములు ,సంతకెళ్ళి కూరగాయలు కొనగా మిగిలిన రెండు పైసలతో తినుబండారాలు కొనుక్కుని సమంగా పంచుకొని తినడం ( ఈ పంపకాల్లో గిల్లి కజ్జాలు సరేసరి ) ఇంట్లో కోడి పెట్టిన గుడ్లను వండి సగం ముక్కలు చేసి పిల్లలందరికీ వేయడం ....ఇలాగన్నమాట .అసలు అమ్మ వాళ్లు ఐదుగురు అక్క చెల్లెళ్ళు .వారం వారం తలంటు పోసుకోవడమే ఓ పండగలా ఉండేదట .ఇక పండగ వస్తే చెప్పక్కర్లేదు .ఇవన్నీ అమ్మా నాన్నలు చెబుతుంటే మాకు కధలాగే ఉండేది .
ఇక మాతరం ..... ఇద్దరు లేక ముగ్గురు ...సౌకర్యాలు కాస్త ఎక్కువగా అందేవి .ఉన్నంతలో ఎవరికీ కావాల్సినవి వారికి అమర్చి పెట్టడంతో ప్రతీది పంచుకునే అవసరం కాస్త తగ్గింది .అయినా పెద్దవాళ్ళ పుస్తకాలు రెండో వాళ్ళూ ఆ తర్వాత తెలిసిన వాళ్ళకి ...ఇచ్చి పుచ్చు కోవడం జరుగుతూ ఉండేది .అలాగే బట్టలూను ...నా చిన్నప్పుడు నా బట్టలు పిన్నికి (మా పిన్ని కూతురు ) ఇచ్చేదాన్ని ,నా తర్వాత నా పుస్తకాలు ఇద్దరు చదువుకునే వారు ,సెలవులకి మా అమ్మమ్మ వాళ్ల వూరు వెళ్తే బెల్లం ఆడేచోట పానకం తాగేవాళ్ళం , పొలానికి వెళ్లి గట్లవెంబడి కన్ది కాయలు కోసుకునేవాళ్ళం ...ఇలా చెప్తే మా పిల్లలు కధలుగానే వినేవాళ్ళు .ఇప్పటి వాళ్ళకీ అనుభవాలు లేవు మరి సెలవులిస్తే సమ్మర్ కేంప్ లు ,కంప్యుటర్ కోచింగ్ లు తప్ప .
ఇక ఇప్పుడు ...ఆడైనా , మగైనా ...ఒక్కరే ...( దేశ జనాభా పెరుగుతుందని కాదు )మళ్ళీ ఇద్దర్ని కంటే వార్ని చదివించడం ,ఆస్తిపాస్తులు పంచి ఇవ్వడం కష్టమని ...( తల్లితండ్రులు చివరి వరకూ తోడుండరు .కాబట్టి కనీసం ఇద్దర్ని కంటే కష్టం లోనూ ,సుఖం లోనూ ఒకరికొకరు తోడుగా ఉంటారని నా అభిప్రాయం )
ఒక్కరే కాబట్టి అతి గారాబం ,అవసరానికి మించి అన్నీ అమర్చి పెట్టడం ,అది తాహతుకు మించినదైనా సరే తమ పిల్లల్ని ఎలోటూ తెలియకుండా ఉంచాలన్న ఆలోచన .ఈ పోటీ ప్రపంచంలో నిలదోక్కుకునేలా చేయాలనే తాపత్రయం తో వారి బాల్యాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేసి ,బండెడు పుస్తకాల భారం వారిపై మోపుతున్నారు .బామ్మ ,తాత మాట అటుంచి తల్లి తండ్రుల ప్రేమైనా పూర్తిగా దక్కుతుందా అంటే ....అనుమానమే ,భార్యా భర్తలు ఉద్యోగాలు చేస్తుంటే ..వారితో గడిపే సమయం ఎక్కడుంటుంది ?
నేల బండ , తొక్కుడు బిళ్ళ ,ఒప్పులకుప్పా ....ఇటువంటి ఆటలు ఉంటాయని ఇప్పటి పిల్లల్లో చాలామందికి తెలీనే తెలీదు .అవన్నీ మేమాడుకున్న ఆటలు అని చెప్తే ఇప్పటి చిన్న పిల్లలు వింతగా చూస్తారు ఏదో గ్రహాంతర వాసిని చూసినట్టు (స్వీయానుభవం ) ఇప్పుడు పిల్లలు కంప్యుటర్ గేమ్స్ ఆడటమే ప్రిస్టేజ్ గా భావించే తల్లితండ్రులు కూడా ఉండటం బాధాకరం .
నాకు తెలిసిన వారి పాపను ( వారికి ఒకే పాప ) వారుండే టౌనులో కూడా ఎడ్యుకేషన్ బాలేదని ,సిటీ లో ఓ పేరున్న పెద్ద స్కూల్ లో ,హాస్టల్ లో వేశారు .కొద్దిరోజులకు ఆ అమ్మాయి ఉండనని పేచీ పెడితే ,తండ్రి ఉద్యోగ రీత్యా రాలేడు కాబట్టి తల్లి వచ్చి ఇల్లు తీసుకుని కూతుర్ని చదివిస్తోంది .తండ్రి ఎ నెలకో ఓసారి వస్తాడు .ఈ మధ్య ఆ స్కూల్ కూడా అన్ని యాక్టివిటీస్ కి సమానంగా ప్రాధాన్యత ఇస్తుంది ,ఈ ఈతలూ ,యోగాలూ మనకేం మార్కులు తెచ్చి పెట్టవు అంటూ అచ్చంగా చదువు (??) మాత్రమె చెప్పే (రుద్దేసే ) స్కూల్స్ కొత్తగా పెట్టారటగా దాంట్లో చేర్పిస్తానంటుంటే ...పాపం ఆ పిల్ల మీద జాలేసింది .ఇంతకూ ఆ పాప చదివేది ఆరవ తరగతి .
మన తల్లితండ్రుల బాల్యం మనకు ,మన బాల్యం మన పిల్లలకూ కధగా అనిపించినపుడు ...కొన్ని తరాల తర్వాత కదా చరిత్రగా ఎందుక్కాకూడదు .ఇప్పుడు మన చరిత్ర లో చదువుకోనేవన్నీ ఒకప్పుడు జరిగినవేగా ! అలాగే ముందు ముందు బాల్యం అనే పాఠాన్ని పిల్లలు పుస్తకాల్లో చదువు కుంటారేమో ....
**అన్ని కుటుంబాల్లోనూ ఇలాగే జరుగుతుందని కాదు .మన చుట్టూ పరికిస్తే ఎక్కువ శాతం ఇలాగే ఉంటున్నారని నా ఆవేదన .ఇది నా అభిప్రాయం మాత్రమే .ఎవరి మనసు నైనా నొప్పించి ఉంటే మన్నించగలరు .