Wednesday, November 9, 2011

నేను ఫెయిల్ అయ్యాను ప్చ్ ....

sad,emoticon,face,fun,happy,smile,smiley,emotion,funny


ఈ ఎనిమిది నెలలుగా నాకోసం నేను కొంత సమయం కూడా కేటాయించుకోలేని పరిస్థితులు ! అవేంబాధించేవి బాధపెట్టేవి కాదులెండి ...అంతా మంచే! కాకపొతే బ్లాగ్ బంధువులకు దూరమయ్యాననే ఒక చిన్న ఫీలింగ్ అప్పుడప్పుడూ ముల్లులా గుచ్చుకునేది.ఈ రోజెందుకో సడన్ గా గుర్తుకొచ్చింది మూడు వసంతాలకు ముందు ఇదే రోజు "నీ మౌనం" అనేబుల్లి కవితతో బ్లాగ్ లోకంలో అడుగు పెట్టానని !గృహిణిగా వంద శాతం మార్కులతో పాసయ్యాను కాని ....ప్చ్ ....బ్లాగ్ లోకంలో ఫెయిల్ అయ్యా ఐనా పరిమళానికి హ్యాపీ బర్త్ డే చెప్పాలనిపించి...ఇలా ......

అన్నట్టు మిత్రులంతా కుశలమే కదూ !

Friday, March 11, 2011

ప్రతిజ్ఞ!


తెలుగు వెలుగును ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మహనీయులు వారు.వారి విగ్రహాలు తెలుగువారి వారసత్వ సంపద!వారసులం మనమే వాటిని కూల్చేసుకున్నామా?పంచభూతాల సాక్షిగా మహనీయుల విగ్రహాలు నేలకూలిన వేళ ....మనసు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ....టాంక్ బండపై ప్రతిజ్ఞ చేశారని టివిలో చూసినపుడు వీరంతా భారత పౌరులుగా మొదట చేసిన ప్రతిజ్ఞను మరిచారా ..లేక చిన్ననాడు వీరిచేత ఉపాధ్యాయులు కాని, తల్లితండ్రులు కాని ఈ ప్రతిజ్ఞను వల్లె వేయించలేదో తెలియలేదు.దుఃఖం వస్తోంది.అతి ప్రాచీనమని మురిసిపోయే మన నాగరికత ఇదేనాఅని!

స్కూళ్ళలో చెప్పిస్తున్నారోలేదో....ఒకవేళ చెప్పినా దాని అర్ధం వివరిస్తున్నారో లేక మొక్కుబడిగా చెబుతున్నారో తెలీదు.కనీసం తల్లితండ్రులైనా తప్పనిసరిగా తమ పిల్లలకు ఈ ప్రతిజ్ఞ నేర్పించి , అర్ధం వివరించి వారి మనసులో దేశభక్తి పెంపొందేలా చూడాలి.బాధ్యతాయుతమైన భారతీయ పౌరులుగా తీర్చి దిద్దాలి.

ప్రతిజ్ఞ

భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము.
దానికి అర్హుడనగుటకై కృషి చేయుదునని,
నేను నా తల్లితండ్రులనూ, ఉపాధ్యాయులనూ, పెద్దలందరినీ గౌరవింతునని,
నా దేశము పట్ల, దాని ప్రజల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉందునని ప్రతిఙ చేయుచున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

Wednesday, March 9, 2011

వందేళ్ళ పండుగట!


మార్చి ఎనిమిదో తారీఖు! మహిళా దినోత్సవం...అదీ వందోది. ఇక ఈ వారమంతా బట్టల షాపుల్లో , బంగారం షాపుల్లో ..ఇంకా సూపర్ మార్కెట్లల్లో ఒకటేవిటి చాలా వాటిల్లో రాయితీలు ప్రకటించారు స్త్రీలకోసం!మనవాళ్ళెంతక్కువా ...మీటింగులు పెట్టుకున్నారు,ఆటల పోటీలు,పాటల పోటీలు ,వంటలపోటీలు ఎడా పెడా పెట్టేసుకునితెగ సంబర పడిపోయారు.అసంబ్లీలో కూడా మన మహిళా మంత్రులు కేకులులూగట్రా కోసి పండుగ చేసుకున్నారు.ఆ రోజుకి మాట్లాడే అవకాశంఇచ్చినందుకు తెగమురిసిపోయి సభాపతిగారికి కృతజ్ఞతలు తెలిపి ...ఇంకా ఇటువంటి అవకాశం ప్రతి రోజూ కల్పించాలని విన్నవించారట!

వందేళ్ళ మహిళా దినోత్సవం!
ఎన్నేళ్ళ చరిత్ర చూసినా ....
ఏమున్నది గర్వకారణం ?
స్త్రీజాతి చరిత్ర సమస్తం
జీవన్మరణ పోరాటం!
కడుపులో శిశువుకి
గర్భస్రావపు పీడలు
విసిరేసిన పసి దేహాలు
చెత్తకుప్పల్లోవాటిజాడలు
అందమైన బాల్యంపైనా
వేధింపుల నీడలు
యువతికియవ్వనమంతా
ప్రతిదినమొక గండం
సగటు గృహిణి జీవితం
నిరాశా నిస్పృహలమయం
వృద్ధాప్యపు మజిలీలోనా
గుచ్చుకుంటున్ననిర్లక్ష్యపు ముళ్ళు !

మహిళలు ఇప్పటి వరకూ సాధించింది ఏం లేదని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు సుమండీ ....సాధించిన దానికి సంతృప్తిని చెంది ...అదే విజయమనుకుంటే పొరపాటేమో ఆలోచించండి.ఎంతమంది యాసిడ్ దాడుల్లో,గొంతు కోసే ఉన్మాదుల చేతుల్లో ,వరకట్నపు కోరల్లో బలైపోయారో....ఇంకెంతమంది మానసికంగా,శారీరకంగా హింసించబడి ఆత్మహత్యలు చేసుకున్నారో? బలైపోయిన వారికి చట్టం ద్వారా న్యాయంజరుగుతుందా? దోషులకు తగిన శిక్షలు అమలుజరుగుతున్నాయా?ఒకవేళ జరిగితే ఎంతశాతం ?
మరి బాధల, భయాల నీడన ఎందుకీ ఉత్సవాలు?ప్రతి మహిళ ముఖంలో చెదరని చిర్నవ్వు...హృదయం నిండా ధైర్యంనింపుకొని ఆత్మస్థైర్యంతో జీవించినరోజు అప్పుడు అసలైన మహిళల పండుగ!

Friday, February 25, 2011

బంద్.....ప్రశాంతం ??


టీవిలో న్యూస్ వస్తోంది చిరునవ్వులు చిందిస్తున్న న్యూస్ రీడర్ న్యూస్ చదువుతోంది ప్రశాంతంగా ముగిసిన బంద్! బంద్ సంపూర్ణం!ఫలానా చోట రెండు భోగీలు తగలబెట్టారు,ఫలానా స్టేషన్ కి నిప్పు పెట్టారు ,రెండు కాలేజీ బస్సులు దగ్ధం చేశారు , మరోచోట బస్సులపై రాళ్ళు రువ్వారు , షాపులు ధ్వంసం చేశారు,బస్సులు నిలిపివేశారు .మొత్తానికి బంద్ ప్రశాంతంగా ముగిసింది . ఇంతలో ఒక వ్యక్తి స్క్రీన్ మీదకి వచ్చిప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించారు బంద్ సక్సస్ అయింది అంటూ మాట్లాడాడు.నాకు కొద్దిరోజుల క్రిందట ఒక పెద్దాయన మాట్లాడుతూ మేం గాంధీ మార్గాన్ని అనుసరిస్తాం అన్నమాటలు గుర్తుకొచ్చి ఇదేనా ఇప్పటి గాంధీగిరి అనుకున్నా!

బంద్ రెండురోజులూ గుడ్డూ , బ్రెడ్డూ కూడా దొరకలేదు.మా బంధువులమ్మాయి చెల్లెలి పెళ్ళికని ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో బస్ కి ఊరికేల్తుంటే బస్ ఆపేసారట!పాపం ఆమె భర్త ఎక్కువరోజులు సెలవు పెట్టడం కుదరక ఆమెని పిల్లల్ని రెండు రోజుల ముందు పంపిస్తే జరిగింది ఇది !ఆమె దిగి ఆటోల్లేక సిటీ బస్ లు తిరగక నానా అవస్తలు పడి వెనక్కోచ్చేసిందట! మా కజిన్ ఒకడు పెట్రోల్ బంక్ లు లేక బయట లూజు పెట్రోల్ కొంటె లీటరు 150/-తీసుకున్నారట.తిరిగిన కొద్ది ఆటోలూ రెట్టింపు కంటే ఎక్కువ వసూలు చేశారు.సొమ్ము చేసుకోనేవారంతా మనుషుల అవసరాన్ని సొమ్ము చేసుకొన్నారు.నాకు తెలిసి ఇవే కాని బయట ఇలాంటివి ఎన్నో జరిగి ఉంటాయి.

మన సంగతే ఇలా ఉంటే ఇక ఏరోజు కారోజు సరుకులు తెచ్చుకోనేవారు, ఈ రోజు ఆటో నడిపితేనే రేపు గడిచేది అన్నవాళ్ళూ,చిన్న చిన్నటీస్టాల్స్ , తోపుడు బండ్ల వాళ్ళు ,పువ్వులమ్ముకొనేవాళ్ళూ, బంద్ తో మాకు సంబంధం లేదు మీరు రాకపోతే జీతం కోతే అనేచోట పనిచేసే చిన్న ఉద్యోగులూ ...ఇలా చెప్పుకుంటూ పొతే నష్ట పోయేవాళ్ళూ , కష్టపడేవాళ్ళూ ఎంతోమంది ఉన్నారు.ఆకలికి , అవసరానికీ , కష్టానికి కుల మత జాతి ప్రాంతీయ బేధాలు లేవుకదా ? అవి అందరికీ ఒక్కటే !

ఇంతకూ నాకు అర్ధం కానిది నిజంగానేనండీ ...ఒక సామాన్య గృహిణిగా నాకు అర్ధం కానిది ఈ బస్సులు రైళ్ళూ అవీ తగలేసి ప్రభుత్వాన్ని నష్టపరిస్తే ఆ నష్టమంతా ప్రజా ప్రతినిధులూ ,మంత్రులూ ఏమన్నా భారిస్తారా ఆభారమంతా ఏదోక రూపంలో ప్రజలమీదే కదా వేసేది. బంద్ లు చేసుకోవచ్చేమో మనది ప్రజాస్వామ్యం కనుక !కాని ప్రభుత్వ , ప్రెవేటు ఆస్తులు ధ్వంసం చేయటం వల్ల నష్టం ఎవరికి ? లాభపడేది ఎవరు ?

Sunday, February 13, 2011

ప్రేమకు అర్ధం చెప్పే కవిత !

ఈ కవిత చాలా ఏళ్ళక్రితం ఆంద్ర భూమి అనుకుంటా...వార పత్రికలో వచ్చింది కాగితంపై రాసిపెట్టుకున్నాఏదో వెదుకుతుంటే ఒక పుస్తకంలో శిధిలావస్థలో ఆ కాగితం కనపడింది నా అజాగ్రత్తకు తిట్టుకుంటూ ఈ అద్భుతమైన కవితని మీతో పంచుకోవాలని ఈ టపా! పెద్దదిగా ఉందని అనుకోకుండా పూర్తిగా చదవండెం.ప్రేమకు అర్ధం చెప్పే కవిత !ఈ ప్రేమికుల రోజు గులాబీలు , గిఫ్ట్ లు ఇచ్చుకొని మళ్ళీ ప్రేమికులరోజు వచ్చేసరికి విడిపోయి కొత్తవారి వేటలో ఉండే వారు ఎక్కువై నిజమైన ప్రేమికులు కరువైన (అసలు లేరని కాదు)ఈ రోజుల్లో ఈ కవిత నిజమైన ప్రేమకు ప్రతిబింబంగా నిలుస్తుంది.
***ఈ కవితకు ఇంగ్లీషు మూలం జాన్ డన్ గారు...తెలుగు అనువాదం గోదావరి శర్మ గారు.
వీడ్కోలు
గొప్పవారు మరణంలో ఒప్పుకోరు ఓటమిని
రట్టులేక రభసలేక గుట్టుగానే పోతారు
బంధుమిత్రులెంతమంది చెంతచేరి గోలచేసి
వింతరీతి ఎంతఏడ్చినా వారుమటుకు వీరులే !

ఆరీతిగా నేనుకూడ వెళుతున్నానిన్నువీడి
కార్చబోకు కన్నీళ్లను విడవబోకు నిట్టూర్పులు
మనప్రేమ అనురాగం మనలోనే మననియ్యి
మనసులేని లోకానికి మనసంగతి చెప్పొద్దు

చిన్నచిన్నకష్టాలకి చిన్నబోవు లోకమిది
అత్యున్నత విషయాల్లో వ్యత్యాసం చూడలేదు
రోడ్డుమీది ట్రాఫిక్కే గడ్డు సమస్యవుతుంటే
గెలాక్సీల గమనాలని గమనించే కళ్ళేవీ ?

కళ్ళుచూసి ఒళ్ళుచూసి ప్రేమలో పడేవాళ్ళు
మనిషి దూరమవగానే ప్రేమలోంచి పడతారు
మనసుమనసుకలుపుకున్న మనమాదిరిప్రేమికులను
శరీరాలు ఎడమైనా విరహ బాధ వేదించదు

మనతనువులు రెండింటిలో మనసొకటే ఉందికనుక
కనకమొకటే ఆమనసుకు సాటివచ్చు మేటికనక
సాగుతుంది ఎడతెగక బంగారపు తీగలాగా
ఎంత మనం ఎడమైతే అంతమేర వ్యాపిస్తూ ....

అలాకాక ఇద్దరిలో ఇరుమనసులు ఉండాలని
ఎవరైనా శాసిస్తే ఎదురాడక ఔనందాం...
అద్వైతం సాధించిన ఆరెండిటి ఐక్యాన్నీ
విద్యార్ధులువాడు వృత్త లేఖినితో పోలుద్దాం

కేంద్రంలో ఉన్నకాలు ఇంటిలోని నిన్నుపోలు
పరిధివెంట పరిగెత్తే మరోకాలు నన్నుపోలు
ఏ వైపుకి నే వెళితే ఆ వైపే వొరుగుతావు
తిరిగినిన్నుచేరువేళ నిటారుగా నిలుస్తావు

నిలకడగా నువ్వుంటే నా వృత్తం చేదిరిపోదు
విరహాన్నే విరచించే నా యత్నం వృధాపోదు
వ్యాసార్ధం సున్నాచేసి నన్ను నిన్ను చేరుకోనీ
బయలుదేరు బిందువులో తిరిగివచ్చికలిసిపోనీ!

Monday, February 7, 2011

దెయ్యమా ....పిచ్చా??


ప్రసన్నకి దెయ్యం పట్టిందట! కాదంట....పిచ్చని అంటున్నారు.ఆనోటా ఆనోటా వింటున్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి.ఏంటీ వీళ్ళంతా....నిన్న మొన్నటి వరకు ప్రసన్నదేవత...సంసారాన్ని చక్కగా దిద్దుకుంది...అందరికీ తలలో నాలుకలా ఉంటుంది...ఎవరికి ఏ సహాయం కావాలన్నాసొంత మనిషిలా చేస్తుంది అన్న బంధువులే ఇప్పుడిలా అంటున్నారంటే ఏం జరిగిందో...ఆలోచిస్తూ ఉండగానే సుబ్బక్క వచ్చింది .బుజ్జీ! ప్రసన్నని చూట్టానికి వెళ్తున్నా...నువ్వు వస్తావా? ఒక్కనిముషం ఉండక్కా...కొంచెం మొహం కడుక్కొని వచ్చేస్తాను.ఇంతకూ ఏమైంది...దెయ్యం పట్టిందని అంటున్నారు...చేతికొచ్చినవన్నీ విసిరేస్తుందట!తల గోడకి కొట్టుకుంటుందట...తనలో తనే ఏడుస్తుందట లేకపోతే మౌనంగా ఉండిపోవడం చేస్తుందట! వింటూనే రెడీఅయి తాళంవేసి బయలుదేరాను.

ప్రసన్నక్క...తనతో నాకు మంచి అనుబంధమే ఉంది.బంధుత్వం కన్నా స్నేహంగా ఉంటుంది.తనకి ఏదైనా మానసిక సమస్యా ? వీళ్ళంతా మూర్ఖంగా దెయ్యం ..భూతం అంటూ భూతవైద్యం చేయిస్తున్నారా ? ఐనా మానసిక సమస్యలు ఏం ఉంటాయితనకి ? మంచి భర్త ,చక్కటి పిల్లలు దాదాపు సెటిలైపోయినట్టే ...ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు. ఇంట్లో కూడా తను ఎంతంటే అంతే! ఆలోచనలు సాగుతూ ఉండగానే ఇంట్లోకి అడుగు పెట్టాం.

ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.అంతకు ముందే ఏదో సాంబ్రాణి లాంటిది వేసినట్టు వాసన వస్తోంది.ప్రసన్నక్క దివాన్ మీద
పడుకొని ఉంది.అంతకు ముందు ఎప్పుడు ఇంటికొచ్చినా ఎదురొచ్చి గలగలా పలకరించేది.ఇప్పుడు మేమెవరో తెలీనట్టు శూన్యంలోకి చూస్తూమౌనంగా ఉండిపోయింది . ఎంతలో ఎంత మార్పు! పసిమిఛాయ వన్నెతరిగి కళ్ళకింద నల్లటి వలయాలు...మెడలోనూ , చేతికీ ఏవో రక్షలు కట్టారనుకుంటా.లోపలినుండి వాళ్ళమ్మగారు ఏదో విభూతి నీళ్ళలో కలిపి పట్టుకొచ్చారు.మాట్లాడకుండా తాగేసి అటు తిరిగి పడుకుంది. పెద్దావిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటే బాధనిపించింది.కాసేపటి తర్వాత ఇద్దరం లేచి వెళ్ళొస్తామని చెప్పి...దివాన్ దగ్గరగా వెళ్లి వంగి వెళ్తానక్కా అని
చెప్పి వెనక్కి తిరుగుతుంటే నా చేయి పట్టుకుంది.ఆశ్చర్యంగా అనిపించింది. సరే సుబ్బక్కా ...నేను కాస్సేపు ఆగి వస్తాలే నువ్వెళ్ళు అంటూ దివాన్ మీద పక్కనే కూర్చుండిపోయాను .

బుజ్జీ...నువ్వు అక్కదగ్గర ఉంటావుకదా...నేను పదినిముషాలలో పాల పేకెట్లు తెచ్చుకుంటాను అని ప్రసన్నక్క వాళ్ళమ్మ కూడా బైటకి వెళ్లారు.అప్పటివరకు మౌనంగా ఉన్నతను బుజ్జీ ...నువ్వుకూడా నాకు పిచ్చో ....దెయ్యం పట్టిందో అనుకుంటున్నావా ..అని అడిగే సరికి షాకయ్యాను.అసలేం జరిగిందక్కా ...
బుజ్జీ....మా పెళ్ళయ్యి ఇరవై ఏడేళ్ళు...ఈ ఇరవైఏడేళ్ళూ...ఇల్లాలిగా ,కోడలిగా , తల్లిగా ...అన్ని బాధ్యతలూ సక్రమంగా నిర్వహించాను.ఎప్పుడూ పిల్లలకోసం ,ఆయనకోసం తాపత్రయపడ్డాను. పిల్లల్ని పెంచడంలో,చదివించడంలో ,పెళ్లి చేసినపుడు అన్ని విషయాల్లోనూ ....ఇన్నేళ్ళలో వాళ్ళకు ఏలోటూ రాకుండా ..ఎవరిచేతా ఒక్క మాట అనిపించుకోకుండా...నెట్టుకు రావడం మాటలేంకాదు దానికోసం నా ఆరోగ్యం ,ఆనందం అని ఎప్పుడూ చూసుకోలేదు.అలాగే అందరూ నన్నూ అలాగే ప్రేమగా చూసుకున్నారు.కాని ఇప్పుడు నా మనసుని అర్ధం చేసుకొనే తీరిక ఓపిక ఎవరికీ లేవు. ఒకవిషయం చెప్తాను మనమధ్యే ఉండనివ్వు.నువ్వూ నమ్మకపోతే నవ్వుకో ...దాదాపు పదిహేనేళ్ళ క్రితం ఓ జ్యోతిష్యుడు మీ బావగారిజాతకం చెప్పాడు. నమ్మాలో వద్దో తెలీదు నేనూ మూధనమ్మకాలకు దూరమే..కాని కొన్ని సంఘటనలు మా జీవితంలో ఆయన చెప్పినట్టూ జరిగాయి. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు.ఈ సంవత్సరం భార్యకు ప్రాణగండం అని! ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు. కాని నాలో అంతర్గతంగా ఉన్న భయాన్ని చెప్పినపుడు ఎంత తేలిగ్గా తీసి పడేశారంటే ...పైగా ఆయనా ,పిల్లలూ ఎగతాళి చేశారు. మూర్ఖత్వం అన్నారు. అసలు పట్టించుకోకుండానే ..ఎవరి పనుల్లో వారు కాలం గడిపేస్తున్నారు. నా భయాన్నిగాని...నా ఫీలింగ్స్ కాని వాళ్లకి అక్కర్లేదు అర్ధం చేసుకోరు. అది నిజం అవునో కాదో ...ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుందాం.నిజం ఐతే నాకోసం నేను బ్రతకకుండానే నా జీవితం అయిపోతుంది. ఒకవేళ నాది మూర్ఖత్వమే ఐనా ఇరవై ఏడేళ్ళు వాళ్ళకోసం బ్రతికాను...ఒక్క సంవత్సరం నాకోసం వాళ్ళేమీ చెయ్యకూడదా..సరదాగా కనీసం అప్పుడప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లటం...అసలు నాకూ చిన్న చిన్న కోరికలు ఉంటాయని...నాకూ మనసుంటుందని నా భయాన్నిఎగతాళి చేసే బదులు అర్ధం చేసుకొని ధైర్యాన్నివ్వాలని అనిపించదేం వీళ్ళకి....ఎందుకు నన్నర్ధం చేసుకోరు? విపరీతమైన కోపం వస్తుంది ...అందరిపైనా ప్రేమ స్థానంలో ద్వేషం పెరుగుతుంది చచ్చిపోవాలనిపిస్తోంది చచ్చి వీళ్ళందర్నీ ఎడిపించాలనిపిస్తోంది...అందరిపైనా ఉక్రోషం.....కన్నీళ్లు జలజలా రాలుతూండగా.....సడన్ గా ఆపేసి అటు తిరిగిపోయింది. గుమ్మంవైపు చూస్తె పెద్దమ్మ వచ్చేసింది.

అంతా అయోమయంగా అనిపించింది .ఏం మాట్లాడాలో తెలీలేదు .సరే పెద్దమ్మా...ఇక నేను వెళ్తాను అంటూ .....బయటికి నడిచాను. ప్రసన్నక్కకి దెయ్యం పట్టిందా ...లేక పిచ్చా అని ఆలోచిస్తూ కళ్ళనిండా నీళ్ళతో భారమైన మనసుతో ఇంటి దారి పట్టాను.

Tuesday, January 25, 2011

మంచి చెడులు రెండూ ... మనకు అవసరమే !


'మృతియె లేకున్న రుచిఏది బ్రతుకులోన '
అన్నారో కవి
చీకటి లేనిదే వెలుగు విలువ తెలీదు
కష్టమనేదే లేకుంటే సంతోషానికి
అర్ధం తెలీదు
ఐనా మన జీవితంలో రోజులన్నీ
ఒకేలా ఆనందంగా సాఫీగా సాగిపోవాలని
కోరుకుంటాం అందరం
కాని అలా జరిగితే జీవితం విలువ
మనకి తెలీకుండానే ముగిసిపోతుందేమో
మంచిరోజు అంటే మనకు ఆనందాన్నిచ్చింది
అనుకుంటాం
కష్టం కలిగిన రోజును ద్వేషిస్తాం
కాని మనం చెడ్డ అనుకున్న రోజు కూడా
మనకు ఓ గుణపాఠం నేర్పుతుంది
అది మనకు తప్పకుండా జీవితంలో
ఉపయోగపడుతుంది
మనల్ని కాపాడుతుంది
కనుక మన జీవితంలో ఏరోజూ
ద్వేషించాల్సినది కాదు
మంచి చెడులు రెండూ ...
మనకు అవసరమే !

Wednesday, January 19, 2011

ముగ్ధ మనోహరి...


ముగ్ధ మనోహరి...ఇలా అనుకోగానే అలనాటి అందాలనటి జమున అలా కళ్ళముందు కదలాడుతుంది.బాలనురా మదనా...అంటూ చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ అభినయించినా, గోదారి గట్టుంది...అంటూ చిలిపిగా అల్లరి చేసినా, సత్యభామగా రుసరుసలాడుతూ వాల్జెడ విసిరినా , మూగనోముతో కన్నీళ్లు పెట్టించినా ఆమెకు ఆమే సాటి!

మాష్టారూ మాష్టారూ...ఈఝుంకీలేలా ఉన్నాయి...మాష్టారూ మరే...అంటూ మిస్సమ్మలో ఆమె అభినయం ముగ్ధ మనోహరమే కదూ!మీరజాలగలడా నాయానతి వ్రతవిధాన మహిమన్....సత్యాపతి...అంటూ ఆమె అభినయిస్తుంటే ఆ కళ్ళల్లోని అతిశయం..దర్పం...గర్వం...వెరసి ఓహో...సత్యభామ ఇలా ఉండేదా అని అనిపించకుండా ఉండదు.తెలుగువారికి కృష్ణుడిగా రామారావుగారు ఎలాగో తెలుగువారి సత్యభామగా జమున ఎప్పటికీ గుర్తుండిపోతుంది . సత్యభామగా ఎంత మెప్పించగలిగిందో రామాలయం ,మూగనోము వంటి సినిమాల్లో కరుణారసప్రధానమైన పాత్రల్లో ప్రేక్షకుల చేత కంటనీరు పెట్టించిన సహజనటి!

తెలుగులోనే కాకుండా ఇతరభాషా చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన నటీమణి ఆమె.హిందీలో ఆమె నటించిన 'మిలన్ 'చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డ్ వచ్చింది.అదేనండీ మన తెలుగులో మూగమనసులు సినిమాలో గౌరీ పాత్ర !
భూకైలాస్ లో మండోదరిగా, గులేబకావళి కధలో యుక్తిమతిగా, గుండమ్మ కధలో సూర్యకాంతం గారాలపట్టి సరోజగా...ఇలా ఏపాత్ర చూసినా ఆమెరూపం అపురూపం! ఆమె నవ్వితే నెలవంక నవ్వినట్టు ఉంటుంది. అందం,అభినయం కలబోసుకున్న ముగ్ధ మనోహరి జమున మన తెలుగువారు గర్వించదగ్గ నటీమణి!

నిజానికి నాకు మహానటి సావిత్రి అంటే చాలా ఇష్టం! ఐతే ఆమె తర్వాత గర్వంగా చెప్పుకోదగ్గ నటి అనిపిస్తుంది జమునగారిని చూస్తే ! మా అమ్మగారికి మాత్రం జమున అభిమాన నటి! అప్పట్లో కధానాయిక ప్రాధాన్యత కల సినిమాలు జమునవి వస్తే అవి ప్లాప్ ఐనా సరే తప్పకుండా చూసేదట!అంత ఇష్టం అమ్మకి జమున అంటే!
ఈమధ్యే మిస్సమ్మ సినిమా చూశా...ఎన్నోసారో గుర్తులేదు జమున చక్కదనాన్ని మీతో పంచుకుందామని ఈటపా !

Sunday, January 9, 2011

గురుర్దేవో.....??


గురువు అంటే అంధకారం తొలగించువాడని చెబుతారు.శిష్యుల అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు కాబట్టే గురువుకు త్రిమూర్తులతో సమానమైన స్థానమిచ్చి పూజిస్తాం.అక్షరాభ్యాసం ఐన వెంటనే పిల్లలకు ...
గురుర్భ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
అంటూ చెప్పించి గురువు బ్రహ్మ , గురువు విష్ణువు ,గురువు మహేశ్వరుడు గురువు సాక్షాత్ పరబ్రహ్మము అట్టి గురువుకు నమస్కారం చేయమంటూ బుద్ధులు గరుపుతాం ....
ఏక ఏవ పరో బంధుః విషమే సముస్థితే
గురు స్సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవేనమః
ఆపదలు కలిగినపుడు సకల ధర్మ స్వరూపుడగు ఎవడు ఆప్తుడై మన ఆపదలను నివృత్తి చేయునో అట్టి గురువుకు నమస్కారం ....
అట్టిగురువులకు శతకోటి వందనం మరి ఆ గురువుల వల్లే ఆపద వస్తే ....
ఆడపిల్లలకు రక్షణ లేకపోతే...పసి పిల్లలకు శిక్షణ పేరిట శిక్షలు వేస్తుంటే ....ఇక గురువులకు వందనాలకు బదులు దండనలే మిగులుతాయి.ఏ చానెల్ పెట్టినా ప్రతి రెండుమూడు రోజులకోసారి కీచక టీచర్ అని...ఆడపిల్లలమీద వేధింపులనీ వింటూంటే మనసుకెంత బాధనిపిస్తుందో చెప్పలేను.వారికి మాత్రం పిల్లలుండరా...వారూ ఎక్కడైనా చదువుతుంటే అటువంటి వేధింపులకు గురైతే అన్న ఆలోచనే రాదా అనిపిస్తుంది . కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన శిష్యుల్ని మలిన మనస్కులై ఎలా చూస్తారు ?
దండం దశగుణంభవేత్ అన్నారు కానీ దానికి ముందు సామ దాన బేధాల్ని పాటించకుండానే ...తమ తమ ఫ్రస్టేషన్లకు పసిపిల్లల్ని బలిపశువుల్ని చేసి చితక బాదుతున్న గురువులూ ఉన్నారు. వారి భవిష్యత్తు కోసమో...లేక తప్పు చేస్తేనో దండిస్తే ఫరవాలేదు చిన్న విషయాలకే ఓర్పును కోల్పోతున్నారు కన్ను, చెవి అని చూడకుండా కొడుతుంటే ఆతర్వాత పిల్లల తల్లితండ్రులు బాధపడాల్సి వస్తోంది.
కొన్నేళ్ళ క్రిందటివరకూ టీచర్లు పిల్లల్ని కొట్టడం , కంట్రోల్లో పెట్టడం సర్వసాధారణం!తల్లితండ్రులు కూడా పిల్లోడు బాగుపడతాడు అని పట్టించుకొనేవారు కాదు కానీ ఇప్పుడు అది పెద్ద నేరమైపోయింది. సహేతుకమైన కారణం ఉన్నా కూడా పిల్లల్ని దండించ కూడదు.తల్లితండ్రులు కూడా పిల్లల్ని కొట్టడం పట్ల ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య పిల్లల్నిదండిస్తే కంప్లైంట్ చేయటానికి ఏదో టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టినట్టున్నారు.బహుశా కొన్నాళ్ళకు తల్లితండ్రులు ఓ దెబ్బవేసినా అమెరికాలోలా టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసే రోజులోస్తాయేమో.
గురువులందరూ ఒకేలా ఉండరు....కీచక గురువులు మాత్రమే కాదు మహాత్ములూ ఉంటారు .ఓ వారం క్రితం అనుకుంటా పేపర్ లో చదివాను వైజాగ్ దగ్గర శ్రీకాకుళంలో అనుకుంటా ...స్టూడెంట్స్ తప్పు చేశారని టీచర్ శిక్షించుకున్నారట!పిల్లలు పశ్చాత్తాప పడ్డారని రాశారు.నిజంగా ఆయన ఆదర్శానికి వందనం!
ఏది ఏమైనా ఎక్కడో కొద్ది శాతం మంది చేసే తప్పులు వెలుగులోకి వచ్చి గురువులకు మాయని మచ్చను మిగులుస్తున్నాయి కాని మనిషికి చదువు చెప్పి సంస్కరించడానికి గురువే లేకపోతే ఆ సమాజాన్ని ఊహించలేం కదా?అందుకే గురువు ఎప్పుడూ పూజనీయుడే....ఏమంటారు?