Saturday, June 27, 2009

పిట్ట కధలు -2 (యయాతి చెప్పిన నీతి )


యయాతి పుణ్య ఫలంగా అతనికి సిద్ధలోక ప్రాప్తి కలుగుతుంది .ఐతే కొన్నాళ్ళకు తన తపస్సును ప్రశంసించుకొని , ఇతరుల తపస్సును చులకనగా చూడటం వల్ల అతని పుణ్యం క్షీణించి యయాతి సిద్ధలోకం నుండి క్రిందకు పడిపోసాగాడు. ఇది చూసిన తోటి రాజులలో ఒకడైన అష్టకుడనే రాజు యయాతితో ...రాజా ! మీరు పడిపోకుండా ఇక్కడే ఉండేలాగ నా పుణ్యాన్ని మీకు ధారపోస్తాను అన్నాడు . అప్పటికే తన తప్పు తెలుసుకున్న యయాతి ఓ రాజా ! దానం అనేది కేవలం వేదవిదులైన బ్రాహ్మణులు , అశక్తులైన దీనులు మాత్రమే స్వీకరించాలి నేను ఆరెండూ కాదు కాబట్టి నీ దానాన్ని స్వీకరించే అర్హత లేదు కాబట్టి తనని క్రింద పడనీయమన్నాడు .

అక్కడే ఉన్న మరికొంతమంది రాజులను కూడా యయాతి తిరస్కరించాడు .అది చూసిన వశుమానుడనే మహారాజు ముందుకు వచ్చి యయాతి మహారాజా ! మీవంటి పుణ్యాత్ములు ఈలోకంలోనే ఉండాలి మీరు దానం స్వీకరించనన్నారు కనుక మీరు నాకు గుప్పెడు గడ్డిని ఇవ్వండి బదులుగా నా పుణ్యఫలం మొత్తం మీకిచ్చేస్తాను .మూల్యం చెల్లించారు కాబట్టి ఇది దానం కాదు అన్నాడు .

అప్పుడు యయాతి చిరునవ్వుతో తగిన వెల చెల్లించకుండా ఏ వస్తువును స్వీకరించినా అది కూడా దానం క్రిందకే వస్తుంది కాబట్టి వృధా ప్రయాస పడకండి . నా కర్మఫలాన్ని నన్నే అనుభవించనీయండి .....విధాత నిర్ణయించిన దానికి తలవంచుటయే నా ధర్మం అంటూ అందరికీ వినమ్రతతో చేతులు జోడించాడు .

** సాధారణంగా పల్లెల్లో కొబ్బరికాయలు , అరటిపళ్ళు , ఇంకా ప్రత్తి ...మొదలైనవి ఇళ్ళల్లో చెట్లు ఉంటాయి .దాంతో ఇరుగుపొరుగు వారికీ , బంధువులకూ ...దేవుడికైతే ఒక రూపాయిచ్చి తీసుకెళ్ళమని అనటం అలవాటుగా ఉంటుంది . అది తప్పని చెప్పటం హరిదాసుగారి ఆంతర్యం .

Monday, June 22, 2009

సూర్య చంద్రులమా ? మనం !


నేస్తం !
నీకూ నాకూ మధ్య ఏమంత దూరం ?
మనిద్దరి నివాసమూ ఒకటే .......
ఐనా ..మనమెప్పుడూ కలుసుకోలేం
నువ్వున్నప్పుడు నేను రాలేను
నేనున్నప్పుడు నువ్వు రావు ...
ఐతే ..నువ్వేమో స్వయం ప్రకాశివి
నేను మాత్రం నీ జ్ఞాపకాల కాంతిని
నాలో ఇముడ్చుకొని వెలుగుతున్నా !
ఏ యుగాంతానికైనా నీ ఆలింగనం
దొరక్కపోతుందా అని యుగాలుగా
ఎదురు చూస్తూనే ఉన్నా !
ఇంతకూ ......మనం ...
సూర్య చంద్రులమా ?

Saturday, June 13, 2009

పిట్ట కధలు -1


పల్లెల్లో ఉత్సవాలప్పుడు వసంత నవరాత్రులు , గణపతి నవరాత్రులు , దేవీ నవరాత్రులు ...ఇలా ఉత్సవాలు జరిగినప్పుడు ఆలయాల్లో రాత్రివేళ ఏవైనా కార్యక్రమాలు పెట్టటం జరుగుతుంది ..వాటిలో ఓ రోజు తప్పకుండా హరికధ పెట్టిస్తారు .ఆ హరికధ చెప్పే భాగవతార్ లేదా భాగవతారిణి చెప్పే అసలు కధ కంటే కొసరుగా చెప్పే కధలే ఈ పిట్టకధలన్నమాట !

సుష్టుగా భోజనం చేసి చేరతామేమో గుడికి ...కధ మొదలైన కాస్సేపటికే కునికి పాట్లు వచ్చేస్తాయి ..అప్పుడు హరికధాగానం మధ్యలో ఘాట్టిగా హరినామస్మరణ చేయిస్తారు మన భాగవతార్ గారు. ఆ తర్వాత ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా పిట్ట కధ హాస్యాన్ని జోడించి మొదలెట్టగానే కాస్తో కూస్తో ఉన్న మత్తు వదిలిపోతుందన్న మాట !

అటువంటి పిట్టకధలను నేను విన్న కొన్నిటిని మీతో పంచుకోవాలని ఈ టపా ! ఇవి మీక్కూడా తెలిసినవే అయి ఉంటాయి ఐనా మరోసారి గుర్తుచేసుకుంటారు కదూ !

ఇప్పుడొక బుల్లి పిట్టకధ !
అనగనగా ఓ మూర్ఖుడు ...వాడు ఎన్నడూ దైవనామ స్మరణే చేసేవాడు కాదు .ఒకరోజు వాడికి చెట్టు చిటారు కొమ్మ ఎక్కి ఊరు చూడాలనే బుద్ధి పుట్టింది .వెంటనే ఊరిచివర ఉన్న ఓ పెద్ద చెట్టు చివరికంటా ఎక్కేశాడు ...కానీ కొమ్మ బలహీనంగా ఉండటం వల్ల విరిగి పడిపోతూ కాస్త పట్టు ఉండి వేళ్ళాడుతూ ...ఓయ్ ..ఎవరైనా ఉన్నారా ...పడిపోతున్నా ...అంటూ అరవ సాగాడు.కానీ ఊరు శివారు ప్రాంతం వల్ల ఎవ్వరూ పలకలేదు .

పార్వతీ పరమేశ్వరులు భూలోకాన్ని వీక్షిస్తూ ఉండగా ఈ దృశ్యం వారి కళ్ళబడింది .పార్వతీ దేవికి జాలి కలిగి ఎంతైనా తల్లి మనసు కదా ...పరమేశ్వరుడ్ని స్వామీ అతడ్ని కాపాడండి అని అడిగింది .అప్పుడు స్వామి ..దేవీ ..ఇతడు మూర్ఖుడు ..పుట్టి బుద్ధెరిగాక దేవుడ్ని ఒక్కసారి కూడా తలచలేదు ...ఎవ్వరికీ సాయపడిందీ లేదు ఐనా నువ్వు అడిగావు కాబట్టి ఒక పని చేద్దాం ...పడేటప్పుడు అమ్మా అని పిలిచాడనుకో ...నువ్వు కాపాడు ...అయ్యా అంటూ పడితే నేను కాపాడతాను అన్నాడు చిరునవ్వుతో ....ఎవరైనా రెండిట్లో ఏదోకటి అంటారు కదాని సరే అంది అమ్మవారు .

ఈలోగా కొమ్మ విరిగి పడిపోసాగాడా మూర్ఖుడు .పడిపోతూ బాబోయ్ .....అంటూ అరిచాడు . శివ పార్వతులు మూర్ఖుడ్ని మనం కూడా బాగు చేయలేం అనుకుంటూ నిష్క్రమించారు .

Wednesday, June 3, 2009

మీకు తెలుసా ?


చాలా యుగాల క్రిందటి మాట ! క్షీర సాగర మధనం జరిగింది . శ్రీ మహా విష్ణువు మోహినీ రూపంతో అమృతాన్ని దేవతలకు పంచేశాడు . రాక్షసులు అది మనసులో పెట్టుకొని తమ వర గర్వంతో , కామరూప విద్యలతోనూ ..దేవతలమీద దండ యాత్రలు చేశారు .ఐతే విష్ణు మాయ వల్ల ఎప్పుడూ చివరికి దేవతలే గెలిచేవారనుకోండి ...ఇక మన విషయం లోకి వస్తే ...

పై కధంతా తెలిసిన మానవుడొకడు ...తీవ్ర తపస్సు చేశాడు . అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఎందుకు మానవా ఇంత తీవ్ర తపస్సు చేస్తున్నావ్ ? అని అడిగాడు .
మానవుడు ..స్వామీ దేవతలకు ...అమృతాన్ని ఇచ్చారు ...రాక్షసులకు కామరూప విద్యలన్నీ తెలుసు ...కాని మా మానవులకు అన్యాయం జరిగింది .కనుక మాక్కూడా అమృతాన్ని రుచి చూసే భాగ్యం కలగచేయండి . అని ప్రార్ధించాడు .

అప్పుడు బ్రహ్మ దేవుడు ...నాయనా అమృతాన్ని మీకిస్తే దేవతలకూ , మానవులకూ తేడా లేకుండా పోతుంది ..మానవులకు జరా మరణాలు తప్పనిసరి కదా ! కనుక అమృతం తో సరిసమానమైన రుచి కలిగిన దానిని మీకు వరం గా ఇస్తున్నాను తీసుకో అంటూ అతని చేతిలో ఒక పండు జార విడిచాడు .

మానవుడు మహా ప్రసాదంగా కళ్ళకద్దుకొని ఆ ఫలాన్ని ఆరగించి దాని రుచికి మైమరచి పోయి ...ఆహా ..ఈ ఫలాన్ని మన ముందు తరాలవారందరూ ఆరగించాలని ....ఆలోచించి ..ఆ విత్తనాన్ని భూమిలో పాతాడు .దానినుండి వచ్చిన మొక్క ...మానై ...కాయలు కాసింది .ఆ కాయలు ఇప్పటికీ ప్రతి వేసవిలోనూ నోరూరిస్తూ మనముందుకొస్తున్నాయి.

ఆ రోజు బ్రహ్మ ఇచ్చిన పండే ఈ రోజు మనం అందరం ఇష్టపడి తినే మామిడి పండు అన్నమాట !

** కధ చదివిన వారంతా క్షమించాలి ! ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది ఇది కల్పితమని !
మామిడిపళ్ళు అంటే నాకు ప్రాణం !మా వాళ్లు అందరూ వెక్కిరిస్తారు నీ అంత మావిడి పళ్ళ పిచ్చి ఎవరికీ ఉండదని !
అలా వెక్కిరించిన వారికి నేను చెప్పే కల్పిత గాధ ఇది ...కనుక మీరూ సరదాగా తీసుకుంటారు కదూ .... :)

Monday, June 1, 2009

చిట్టితల్లీ......( కవిత )


చిట్టితల్లీ ! వెళ్ళిపోయావా ?
అమ్మ ఒడిలోకి రాకముందే ...
ఈ లోకపు కుళ్ళును చూడలేక
ఆడపిల్లవని అలుసు చేస్తామని ..
చదివినంత చదువు చెప్పించమేమోని
చెప్పించినా ...అల్లరిమూకల
ఆకలి చూపుల కెరకాలేక
ప్రేమోన్మాదుల యాసిడ్ దాడుల భయంతో
అనుమానపు చూపుల అవహేళన
తట్టుకొని నిలువలేక ...
అత్తవారింట వరకట్నపు కోరలకు
ఆహుతి కాలేక ...కన్నవారి
కడుపులో చిచ్చు పెట్టలేక
ముందుగానే వెళ్ళిపోయావా
చిట్టితల్లీ .....
చుక్కల లోకంలో మబ్బుల
తూగుటుయ్యాలలో .....
ఊయలలూగేందుకు హాయిగా ......