Monday, January 18, 2010

పిట్ట కధలు - 3


పిట్ట కధలు -
పిట్ట కధలు -2 (యయాతి చెప్పిన నీతి )

గత జూన్ లో చెప్పుకున్నపై రెండు కధలు చదివారుగా ! ఇప్పుడింకో చిన్న పిట్టకధ !
కలియుగం ప్రారంభమైంది మానవులు మోక్షం కోసం కాక ధనాపేక్షతో , తమ స్వార్ధ ప్రయోజనాలకోసం లక్ష్మిని పూజించడం మొదలుపెట్టారు .పాలకడలిలో శేషతల్పంపై పవళించిన స్వామి పాదాలు వొత్తుతూ పై విషయం తలచుకొని లక్ష్మీదేవి గర్వంతో నవ్వుకోసాగిందట ! ఐతే స్వామి సర్వాంతర్యామి అమ్మ నవ్వులోని అంతర్ధానం గ్రహించి కూడా ఏమీ ఎరుగనట్టు ఏంటి లక్ష్మి నీలో నీవే నవ్వుకొంటున్నావ్ అని అడిగారు .అప్పుడు లక్ష్మీదేవి స్వామీ! కలియుగ మహిమ చూశారా ?భూలోకంలో ఎక్కడ చూసినా నా భక్తులే ఉన్నారు కాని మోక్షాపేక్షగల మీ భక్తులు అసలున్నారా అని సందేహంగా ఉంది అని గర్వంతో అంటుంది .

అమ్మకు ఎలాగైనా గర్వభంగం చేయదలచి స్వామి దేవీ ! భూలోకంలో నా భక్తులు అన్నికాలాల్లోనూ ఉంటారు కాబట్టే ధర్మం ఒంటిపాదంతో ఐనా నిలబడగలుగుతోంది కాకపొతే కాకులు అన్నిచోట్ల కనిపిస్తాయి నీ భక్తుల్లా ...హంసలు అరుదుగా కనిపిస్తాయి నా భక్తుల్లా అంటూ చమత్కరిస్తారు .

అమ్మకు మనసు చివుక్కుమని కోపంతో మీరు చెప్పినట్లు స్వార్ధంలేని భక్తులు ఎవరైనా ఉంటే చూపించండి వారు ఎటువంటివారో నేను నిరూపిస్తాను అని అంటుంది .స్వామి కాశీ క్షేత్రంలో రామానందుడు అనే మహా భక్తుని చూపించి యితడు వాంచారహితుడు , భక్తిని ప్రజలలో వృద్ధి చేయటం తప్ప వేరే స్వార్ధం లేనివాడు అంటూ చెప్పారు .

లక్ష్మీదేవి రామానందుని పరీక్షింప దలచి అతడు నడిచే దారి పక్కగా ధనరాశులను సృష్టించింది ఐతే హరినామస్మరణ చేసుకుంటూ కనీసం తలకూడా తిప్పిచూడకుండా వెళ్ళిపోయాడు రామానందుడు . అమ్మ పట్టువదలకుండా ఆ మర్నాడు తెల్లవారుఝామున రామానందుడు గంగా స్నానానికి వెళ్ళేదారిలో తన మాయతో అందమైన పుష్పాలతో కూడిన ఒక గులాబీ తోటను సృష్టించింది రామానందుడు స్నానం చేసి వెళ్తూ ఆతోటను చూసి ఆశ్చర్యంతో ఇంత అందమైన పుష్పం శ్రీహరి పాదాల చెంత ఉండతగినది అనుకొని ఒక పుష్పాన్ని కోసి చేతపట్టుకోగానే లక్ష్మి మారువేషంలో వచ్చి ఈ తోట నాది నీవు అనుమతి లేకుండా పుష్పాన్ని దొంగిలించావు అన్నది

తల్లీ !క్షమించు ఇంతఅందమైన పూలు కనిపించగానే భగవానుని పాదాలవద్ద ఉంచాలనిపించి కోసాను అంతేగాని దొంగను కాదు అంటూ ఆ పుష్పాన్ని అమ్మకిచ్చి వెళ్ళిపోయాడు రామానందుడు .లక్ష్మీదేవి ఆ పుష్పాన్ని చేతపట్టుకొని విష్ణుమూర్తిని చేరి చూశారా స్వామీ !మీరు చెప్పిన రామానందుడు ఒక దొంగ ఈ పువ్వే దానికి నిదర్శనం అంటూ ఆ పుష్పాన్ని స్వామికందించింది .

అప్పుడు స్వామి చిరునవ్వుతో దేవీ !పొరపాటు పడ్డావు .ఈ పువ్వు అతడు నాకు సమర్పించాలనే కాని స్వార్ధంతో అపహరించాలన్న ఆలోచన లేదు .నా విగ్రహం ముందుంచాలని కోశాడు కాని అతనికి నాపట్ల గల అపార భక్తి వల్ల నీవే స్వయంగా ఈ పుష్పాన్ని తెచ్చి నాకు సమర్పించావు అన్నారు . లక్ష్మీ దేవి గర్వం తొలగిపోయి స్వామీ అపరాధం మన్నించండి మీ భక్తులు అన్నికాలాల్లోనూ పుట్టి ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతూ ప్రజలను భక్తి మార్గంలో నడిపిస్తూ ఆదర్శ జీవనం సాగిస్తారు అంటూ స్వామితో ఏకీభవించింది .

9 comments:

  1. భలే ఉండండి మీ పిట్ట కథ. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు.

    మీ బ్లాగ్ పేరుకు తగ్గట్టు తెలుగు సాహితీ సౌరభాలు వెదజల్లుతోంది.

    ReplyDelete
  2. బాగుందండీ.. ఎప్పటిలాగే..

    ReplyDelete
  3. బాగున్నాయండి మీ పిట్టకధలు.

    ReplyDelete
  4. మంచి కధ...బాల మిత్ర చదివినట్టనిపించింది..

    ReplyDelete
  5. భక్తి వుంటే అమ్మ తీసుకు వెళ్ళి మరి పువ్వు ఇస్తుంది, నాకు ఈ సందేశం బాగా నచ్చింది, ఆమె కు గర్వ భంగం అనే దాని కంటే.

    ReplyDelete
  6. భక్తుని భావం భగవంతుడు కూడా అర్ధం చేసుకో లేడు. అందుకే దేవుడు భక్తునికి లొంగి ఉంటాడు. ఆ సంగతి అమ్మవారికి కూడా తెలుసు. స్వామి కి భక్తుని పట్ల ఉన్న అభిమానాన్ని, ఈ విధంగా పరీక్షిస్తుందేమో! అనిపించింది నాకైతే. చాలా బాగా చెప్పారు.

    ReplyDelete