Saturday, October 27, 2012

శాన్వీ.....

అమ్మా....
ఏ దేవదేవుడో పొరపాటున జారవిడుచుకున్న
దేవపారిజాత పుష్పానివి నువ్వు!
ఏ పురాణేతిహాసాల్లోనూ లేడమ్మా...
ఇంత కౄర రాక్షసాధముడు!
మానవత్వం మంటకలిసిన తరుణంలో
మాపాపపు లోకంలో క్షణమైననిలువక
 దివికేగి...నీదైవత్వాన్ని తిరిగి పొందిన
చిన్నారి దేవతవి నువ్వు!
నిన్ను స్వాగతించినవి నాల్గు చేతులేనేమో
కాని....
వీడ్కోలు పలుకుతున్నవి వేలచేతులు!
ఇక ఎన్ని కొవ్వొత్తులు వెలిగించినా
కానరాదు నీరూపు.....
వ్యధాభరిత హృదయంతో....
చెబుతున్నాం టాటాలూ....బైబైలూ....

* తనసొత్తనేమో తిరిగి తీసుకెళ్ళి ఆతల్లితండ్రులకి కడుపుకోత మిగిల్చిన ఆదేవుడ్నే వారికి ఈబాధను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని ఇవ్వమని ప్రార్ధిస్తున్నా.....

Wednesday, October 24, 2012

దసరా(స్పెషల్ )శుభాకాంక్షలు!

మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.ఇక స్పెషల్ ఏమిటంటారా చూశారుగా పై లడ్డూలు....అవి నేనుచేసినవే.మొన్న ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం చూశాక నాలోనేను చాలా మధనపడి ఇంగ్లీష్ రాకపోతే పోనీ కనీసం లడ్డూ చేయటం కూడా రాదాయే :( ఇది నాక్కూడా ఇజ్జత్ కా సవాల్ అని డిసైడ్ ఐపోయా.పైగా మావారిక్కూడా లడ్డూ అంటే ప్రాణం.నాగురించి మాత్రమే ఆలోచించుకోవడం స్వార్థం.ఆయన ఇష్టాన్నిపంచుకోవడం ప్రేమ.....నేర్చుకొని నేనే చేసిపెట్టడం త్యాగం...ఈవిధంగా జ్ఞానోదయమైన క్షణం, తక్షణం యూట్యుబ్ లో వెదికి లడ్డూ చేయువిధానం చూసేసి ...ఏదైనా ఒక మంచిపని చేయటానికి సంకల్పించినపుడు విజయదశమి కంటే మంచిరోజు మరేముంటుంది? ఆచరణలో పెట్టేశా...

ఇక నేను లడ్డూ చేసిన విధంబెట్టిదనిన...తలంటిపోసుకున్న జుట్టు ఎగరగా క్లిప్పు పెట్టినాను ...భళాభళి
చీరచెంగును నడుముచుట్టూ తిప్పిదోపినాను.....భళాభళీ...
ఘల్లుఘల్లుమను గాజులన్నిటిని వెనక్కి తోసినాను....భళాభళి!
ఆప్రకారంగా సిద్ధమైన నేను ఒకపొయ్యిమీద పంచదార పాకం పెట్టి,మరోపొయ్యిపై ఆయిల్ పెట్టాను.పొయ్యి కూడా వెలిగించానండోయ్.ఇప్పుడు సెనగపిండి జారుగా కలుపుకొని సిధ్ధం చేసుకున్నా.పాకం నెట్ లో చూపించినట్లు తీగపాకం వచ్చేసింది యాలకపొడి కలిపిఉంచా.కాగిన నూనెలో చట్రం పెట్టి పిండి పోశా కాస్త ఇంచుమించుగా బూందీ లాగే వచ్చింది :)దాన్ని పాకంలో వేసి జీడిపప్పు,కిస్మిస్ కలిపి లాడ్డూలా చుట్టేసుకోవడమే.

హమ్మయ్య సక్సస్ ఫుల్ గా తయారుచేసి అమ్మవారికి ముందుగా నివేదనచేసి ఆనందంగా శ్రీవారికి పెట్టాను.పైగా పొద్దున్నే వీళ్ళు లేవకముందే చేసేసా సర్ప్రైజ్ చేద్దామని :) ఇన్నాళ్ళకు మీమనసు అర్ధంచేసుకున్నా...రాబోయే దీపావళికే కాదు మీకెప్పుడు లడ్డూ తినాలనిపించినా నేనే చేసిపెడతాను అంటూ లడ్డూ ప్లేటు అందించానండి అంతే ఒక్కలద్డూ నోట్లోవేసుకోగానే ఆయననోట మాటే రాలేదండీ...బహుశా ఆశ్చర్యానందాలతో అనుకుంటా.లడ్డూ నువ్వు చేశావా అని పారిపోబోతున్న మావాడికి ప్రసాదంరా వద్దనకూడదు అంటూపెట్టా...అది తిన్నవెంటనే నేనెప్పుడూ నీకు ఇంగ్లీష్ రాదని అననమ్మా అంటూ కంటతడి పెట్టుకున్నాడు.నాకళ్లలోకూడా ఆనందభాష్పాలు.అంతలోకి ఆయన తేరుకున్నారనుకుంటా....ఏమికామెంటుతారో అని ఆత్రంగా చూస్తుంటే కళ్ళనిండా నీళ్ళతో (ఆనందభాష్పాలేనండీ) నన్ను దగ్గరికి తీసుకొని దీపావళికి చిన్ని రమ్మంది కదరా మనం వెళదాం సరేనా అన్నారు.నిన్నటివరకు చూద్దాంలే అన్నవారు ఒప్పేసుకున్నారు...ఆనందంగా అదేంటి ఎప్పుడూ రెండు తింటారుగా ఇంకోటి తీసుకోండిఅన్నా...అబ్బే చాలురా ఈరోజు మనింటికి ఎవరోకరువస్తారుగా అందరికీ నువ్వుచేసిన లడ్డూ టేస్ట్ చూపించు అన్నారు నాకళ్ళల్లో మళ్ళీ ఆనందభాష్పాలు....ఈవిధంగా ఆనందంగా దసరా పండుగ స్పెషల్ గా జరుపుకున్నామండీ....మీకందరికీ కూడా నోరు తీపిచేద్దామని.......అరె అదేంటి....అలావెళ్లిపోకండీ...తిని చూసి ఏదోకటి చెప్పండి pleezzzzzzz :) :)

Wednesday, October 10, 2012

పిట్టకధలు - 4 ( విధి )

మిత్రులారా! మన పాత పిట్టకధలు గుర్తున్నాయా! ఒకవేళ మర్చిపోతే లింకులివిగో...
పిట్ట కధలు -1
పిట్ట కధలు -2 (యయాతి చెప్పిన నీతి 
పిట్ట కధలు - 3

కైలాసమున పార్వతీపరమేశ్వరులు ముచ్చటించుకొను ఒకానొక సందర్భములో విధిబలీయమైనది దేవీ అని ఈశ్వరుడు చెప్పుచుండగా...పార్వతి, స్వామీ! అది సామాన్యులకు గాని మనవల్ల కానిదేమున్నది మనము తలచినచో విధికూడా తలవంచునుకదా అన్నదట!అప్పుడు శివుడు లేదుదేవీ విధిని తప్పించుట వ్రాసిన బ్రహ్మకైనా సాధ్యముకాదుసుమా అనగా పార్వతీదేవి ఉక్రోషముతో సకల చరాచర సృష్టికి శక్తినిచ్చు నావల్లకూడా కాదా అని అడుగగా మహాదేవుడు చిరునవ్వుతో కాదన్నాడట!

అప్పుడు ఆమె చేతినిచాచి భూలోకంవైపు చూపుతూ అక్కడ ఆడుతూ పాడుతూ తిరుగుతున్న ఒక పదహారేళ్ళ కుర్రవాడిని చూపించి అతని విధి ఏమిటి అని ప్రశ్నించింది. శివుడాపిల్లవాడిని చూసి పాపం అతడు కొద్దినిముషములలో పాము కాటువల్ల చనిపోవునని చెప్పాడు.పార్వతీదేవి వానిని నేనుకాపాడెదనని చెప్పి ఆపిల్లవాడినే చూస్తూవుండగా వాడు తనగుడిశలోకి వెళ్లి వుట్టిమీదున్న చద్ది అన్నం తెచ్చుకొని కంచంలో వడ్డించుకొని తినసాగాడు.అక్కడే ఓమూల చుట్టచుట్టుకొని వున్ననాగుపామొకటి అలికిడికి బెదరి అతనివెనుకగా పడగ విప్పి కాటువేయుటకు సిద్ధపడెను ఆక్షణమునే పార్వతి మనుష్యరూపంలో వచ్చి ఆపిల్లవాడిని గట్టిగా పిలిచింది.వెంటనే పిల్లవాడు అన్నం ముందునుండి చటుక్కున లేచి బయటకు వచ్చి చూడగా ఎవ్వరూ కనిపించలేదు.విజయగర్వముతో పార్వతీదేవి శివుడ్ని చూసి చూశారాస్వామీ మీరుకాదన్నది నావల్ల ఐనది అన్నది.స్వామి చిరునవ్వుతో అటుచూడుదేవీ ఏమిజరుగునో... పాము సరిగ్గా కాటువేసే సమయానికి వాడు చటుక్కున లేచివెల్లటంతో ఆకాటు అన్నం లోపడి విషపూరితమైనది తిరిగిలోపలికి వచ్చిఅన్నం తిన్న పిల్లవాడు చనిపోయాడు.పార్వతీదేవి నిర్ఘాంతపోయి మహాదేవునితో పంతమాడినందుకు తలదించుకొని మీరన్నది నిజమేస్వామీ అని ఒప్పుకొన్నదట!
* అందుకే మన పెద్దవాళ్ళు అన్నందగ్గరనుండి లేవకూడదని ఒకవేళ లేవాల్సివస్తే వేరేకంచంలో మళ్ళీ వడ్డించుకొని తినాలని అనేవారట!అంటే అప్పట్లో కరంట్ ఉండేదికాదుకదా దీపాలవెలుగులో ఏవైనా కీటకములు ,పురుగుపుట్రా పడినా కనిపించవని అలా చెప్పేవారేమో!


Friday, October 5, 2012

లడ్డూ బాబోయ్ ....లడ్డూ :) :)

కొన్నేళ్ళ క్రిందట అప్పటికి ఇంకా స్వగృహ ఫుడ్స్ అంటే పెద్దగా తెలీదు.అప్పుడు రాజమండ్రిలో వసుంధర స్వగృహ ఫుడ్స్ అని కొత్తగా పెట్టారు. మావూరికి దగ్గర సిటీ కావడంతో మాకు ఏం కావాల్సినా రాజమండ్రి వెళ్లి తెచ్చుకోనేవాళ్ళం. అలా ఏదో పనిమీద వెళ్ళినప్పుడు మా శ్రీవారు ఈ వసుంధరలో సన్నబూంది లడ్డు ఒక అరకేజీ తీసుకొచ్చారు.చిదిమినోట్లోవేసుకోగానే  కమ్మటి నేతి వాసనతో తియ్యగా....మెత్తగా ...ఆహా...ఏమి రుచి! ఇటువంటి లడ్డు ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు అనుకొంటూ రెండురోజుల్లో అరకేజీ ఖాళీ చేసేశాం.

అప్పటికి లడ్డులు ఇంట్లో చేసినా,ఎవరైనా సారెగా పంచిపెట్టినా కొంచెంలావుబూందీతో చేసినవే! పండగకు బెల్లం మిఠాయి, పంచదార మిఠాయి ఇంట్లోనే చేసేవారు.స్వీట్స్  షాపులో కొనుక్కుంటే కాజాలు,జాంగ్రీలు ,జిలేబీ,ఇంకా రసగుల్లా,కోవా టైపు కొనుక్కోనేవాళ్ళం.అసలే  మా ఇంటాయనకి పంచదార మిఠాయి అంటే ఇష్టం. పంచిపెట్టిన సారె లడ్డూ కూడా వదలరు.సైజు కేజీకి నాలుగు... రెండు దఫాల్లో కానిచ్చేస్తారు.అటువంటిది ఇక ఇంత కమ్మటి లడ్డు దొరుకుతుంటే ఊరుకుంటారా? ఇక ఏ పనిమీద రాజమండ్రి వెళ్ళినా లడ్డూ పేకెట్ ఇంటికి వచ్చేది.అరకేజి అల్లా కేజీ అయ్యింది.తర్వాత కూడా పిల్లలు ఇష్టంగా తింటున్నారని,అలాగే కొనసాగింది.తర్వాత హైదరాబాద్ వచ్చేశాం.ఇక్కడ వీధికో స్వగృహ షాపు! ఇప్పుడు రెండు మూడు కూడా ఉన్నాయనుకోండి.ఇక ఈయనకి పండగే!

అప్పటివరకు ఫర్లేదు కాని ఇక ఇక్కడికొచ్చింది మొదలు...ఎప్పుడు స్వీట్ షాప్ కి వెళ్ళినా లడ్డూనే...ఏమండీ చిన్నివాళ్ళింటికెళ్దాం ఏమైనా..స్వీట్స్ తెండి అనటం పాపం లడ్డూలతో ప్రత్యక్షం.అత్తయ్య వాళ్లింటికెళ్ళినా, మా చెల్లెలి గారింటికి వెళ్లినా...వాళ్ళ అక్కగారింటికి వెళ్ళినా ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా లడ్డూలే ! ఈయన పనిచేసే కాలేజిలో ఏ ఫంక్షన్ వచ్చినా,ఆగష్టు 15 కీ, టీచర్స్ డే కీ, దసరాకి... వినాయకచవితికి కూడా ఉండ్రాళ్ళ తోపాటూ లడ్డూకూడా ఆర్డరివ్వాల్సిందే.ఏ గుడికెళ్ళి కెళ్ళినా లడ్డూ ప్రసాదం తప్పకుండా కొంటారు.తిరుపతిలో ఐతే బ్ల్లాకులో ప్రసాదం కొనటం పాపమండీ అన్నా వినకుండా 20 లడ్డూలైనా కొంటారు.వాటిలో ఓ పది ఆయనకే :)  :)

ఇక ఈవిషయం ఆనోటా ఆనోటా బంధువులకి, స్నేహితులకి తెలిసిపోయింది.ఇక అప్పట్నుంచి మాఇంటికి ఎవరొచ్చినా బావగారికిష్టం అంటూ అన్నయ్యలూ, చిన్నాన్నగారికిష్టం, అన్నయ్యగారికిష్టం,మా పెద్దోడికిష్టం అంటూ ఎవరిమటుకు వారు ప్రేమగా లడ్డూ లే తెస్తున్నారు.ఇలా ఏళ్లు గడిచి పోతున్నా ఇంట్లో అందరికీ ముఖ్యంగా నాకు లడ్డూ మీద (నిజానికి జీవితంమీదే) విరక్తి పుట్టేసింది. ఈయన ఎప్పుడు తిన్నా ఒకటి తినరు రెండు కావాలి.ఐనా అప్పుడు కూడా ఇంకో లడ్డూ కావాలా బాబూ....అంటే నో అని మాత్రం అనరు. లడ్డూ మీద శ్రీవారికి విరక్తి రావాలంటే....కాదు కాదు అసలు లడ్డూ అనే మాటే మాఇంట్లో వినపడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వరూ ప్లీజ్ !

Wednesday, September 26, 2012

చీమ...చీమ....చీమ!

ఈగ....రాజమౌళిగారి సినిమా...తెలియనివారుండరు.ఆ సినిమాలో హీరో నాని మరుజన్మలో ఈగగా పుట్టి తన ప్రియురాల్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా తనను చంపినా విలన్ మీద పగతీర్చుకుంటాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయినా కధ మాత్రం వాస్తవానికి దూరంగా కామెడీగా అనిపిస్తుంది కదూ :) చీమ అని మొదలుపెట్టి ఈగ గురించి చెప్తున్నానని అనుకొంటున్నారా ...అక్కడికేవస్తున్నా.ఇటువంటి కామెడీనే ఈమధ్య మాఇంట్లో తరుచూ జరుగుతోంది.వింటే కామెడీయే కాని అదో పెద్ద టార్చర్.

గత నెలరోజులుగా మాఇంట్లో చీమలు వింతగా ప్రవర్తిస్తున్నాయి.అసలు సిటీకొచ్చి పన్నెండేళ్ళవుతోంది, రెండు అద్దె ఇల్లులు మారి రెండేళ్ళక్రితం సొంత ఫ్లాట్ లోకి వచ్చాం,ఎప్పుడూ  ఇక్కడా చీమలబెడద లేదు.ఇప్పుడు మొదలైంది.ఆ చీమలన్నాక ఇంట్లోకిరావా...బెల్లంచుట్టూ చేరవా..అని మీరనుకుంటున్నారు కదూ?అక్కడే వుంది  వింత! మాఇంట్లో చీమలు బెల్లం చుట్టూ చేరట్లేదండీ అన్నం చుట్టూ చేరుతున్నాయి.ఒక్క అన్నమే కాదు,ఉప్మా,దోస,
ఇంకా రవ్వ,పల్లీలు,పప్పులు మొదలైన వాటిని పడుతున్నాయి.స్వీట్స్ కాని,బెల్లం కాని, పంచదారకాని గట్టుపై పోసినా అస్సలు ముట్టుకోవటం లేదు.కావాలనే అన్నంగిన్నె పక్కన బెల్లంకోరు...స్వీట్ పాకెట్ పెట్టినా,గచ్చుమీద పంచదార చల్లినా పట్టించుకోవట్లేదు.కరెంట్ కుక్కర్ చల్లారితే చాలు మేం తినేలోపే చీమలమయం. అన్నం,పప్పు వంటివన్నీ పెద్ద పళ్ళెంలో నీళ్ళుపోసి వాటిమధ్య పెట్టుకుంటున్నాం.అన్నీ ప్లేసులు మారుస్తూ దాచుకోవాల్సి వస్తుంది. అన్నం దొరికిందా సరే లేకపోతె కబోర్డ్ మూలల్లో సిమెంట్ తోడేస్తున్నాయి. మందుచల్లినా,గోడవారలు పసుపు ఉప్పు కలిపి చల్లినా ఎన్నిచేసినా ఎక్కడ్నించి వస్తాయో తెలీటంలేదు.బారులు తీరి అలా దండులా వస్తుంటే నిజంగానే అవి నామీద పగపట్టాయేమో అనిపిస్తుంది.ఒకవేళ దాని పార్ట్ నర్ ని చూసుకోకుండా వేడి వేడి అన్నం కాని మీదవేసి చంపేశానేమో అని!అందుకే దాని దండుతో సహా దండెత్తి వస్తుందేమో :) ఇంకా నయం దానికి ఏ సమంతా లాంటివారో  ట్రైనింగ్ ఇచ్చి ఉంటే నా గతి ఏమి ఉండేదో కదా :(  :(

# నేనూ సుదీప్ రేంజ్ లో బాగా ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నా పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిచి వాటిని ఫినిష్ చేస్తా హ్హ హ్హ హ్హా ....

Sunday, September 9, 2012

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి నివాళులు !

ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారి అబ్బాయి రోహిణీప్రసాద్ గారు కన్నుమూశారన్న వార్త పేపర్లో చూడగానే చాలా బాధగా అనిపించింది. 1949 సెప్టెంబర్ 14న జన్మించిన ఆయన నిన్న (శనివారం) ఉదయం 11గంటలకు ముంబాయి జస్లోక్ హాస్పటల్ లో కన్నుమూశారట!

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన మంచి సాహితీవేత్తకూడా.సైన్సుకు సంబంధించిన పుస్తకాలతోపాటు ఆయన అంతర్జాలంలో సరళమైన రీతిలో తెలుగులోవ్యాసాలు రాసారు.అవి బహుశా మీకందరికీ సుపరిచితమే! రోహిణీప్రసాద్ గారికి సాహిత్యం పట్లఎంత మక్కువో సంగీతంపట్లకూడా అంతే మక్కువ!ఆయన గురించి ఆయన బ్లాగ్ 'Rohiniprasad Kodavatiganti'లో చూడొచ్చు.

ఆయన ఎంత  గొప్పవారైనా నిగర్వి.ఈవిషయం నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను.ఆయన నా చిన్న బ్లాగులో కృష్ణశాస్త్రి గారి గురించి రాసిన పోస్ట్ చదివి కామెంట్ చేయడమే కాకుండా నన్ను ఏవిధంగా వెన్నుతట్టి ప్రోత్సహించారో ఈక్రింది కామెంట్స్ చూస్తే మీకూ తెలుస్తుంది.మీతో పంచుకోవాలని ఆయన రాసినవి అలాగే పెస్ట్ చేస్తున్నా!

## రెండే రెండు మాటల్లో కవిత్వం రాయగలిగినది ఒక్క కృష్ణశాస్త్రేనని మానాన్న కుటుంబరావుగారనేవారు. సినిమా పాటల్లోనే దీనికెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. 'ఎందుకీ సందెగాలి', 'ఏదీ బృందావనమిక, ఏదీ విరహ గోపిక', 'పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా'.

కొడవటిగంటి రోహిణీప్రసాద్


## ప్రస్తుత పరిస్థితుల్లో మీకు నచ్చిన తెలుగు సాహిత్యం (కృష్ణాశాస్త్రి వగైరా) గురించిన మీ స్పందనను చిన్న వ్యాసాల రూపంలో రాసి, ఈమాట, పొద్దు వంటి వెబ్ పత్రికలకు పంపిస్తే ఈ తరం పాఠకులకు వాటిని పరిచయం చెయ్యగలుగుతారు. ఇటువంటి ప్రయత్నం మీ పాండిత్య ప్రదర్శనకు కాక మీ ఆసక్తిని నలుగురితో పంచుకునేందుకు ఉపయోగపడుతుంది. మంచి పుస్తకాలు కొని, చదివి, అర్థంచేసుకునేంత ఆసక్తిగాని, వ్యవధిగాని లేనివారికి ఇటువంటి రచనలు ఉపయోగపడతాయి. తెలుగు రీడర్‌షిప్ పెరిగేంతవరకూ ఇలాంటివి జరగడం చాలా ఆరోగ్యకరం అనుకుంటాను. మీ మోడెస్టీని అర్థం చేసుకోగలను. దాన్ని గురించి అంతగా పట్టించుకోకుండా రచనలు కొనసాగించండి. బ్లాగ్ రాయడం కన్నా ఎడిటర్లు ఎంపిక చేసే పత్రికలకు రచనలు పంపడం మంచి పని.   
రో.ప్ర.

సర్!మీకు ఆత్మశాంతి కలగాలని కోరుకొంటున్నాను.



Monday, July 16, 2012

తిరిగొచ్చిన బాల్యం!

నాన్నా...నాన్నా!
ఏంటి నాన్నా?
అదేంటి నాన్నా?
అది కాకిరా బాబూ....
అదేంటి?మళ్ళీ అడిగాడు కొడుకు.... అదికాకి నాన్నా...బదులిచ్చాడు తండ్రి.]
ఆమర్నాడు కొడుకు మళ్ళీ అడిగాడు.అదేంటి? అది కాకినాన్నా...
ప్రతిరోజూ వీధిఅరుగుమీద కూర్చుని ఒడిలోకొడుకుని కూర్చోబెట్టుకొని ఆడించడం...కావుకావుమని ఎదోక కాకివచ్చి చుట్టుపక్కల వాలటం....కొడుకు పదేపదే అదేంటి?అని అడిగేవాడు...తండ్రి ఓపిగ్గామళ్ళీ మళ్ళీ అడికాకి అని బదులిస్తూఉండేవాడు.

కొన్నేళ్ళు గడిచాయి కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు.పెళ్లైంది..కొడుకు పుట్టాడు.అతని తండ్రి ముసలివాడయ్యాడు.ఆస్తిపాస్తులన్నీ కొడుక్కి అప్పగించి బాధ్యత దించేసుకున్నాడు.ఐతే వృత్తిరీత్యా కొడుకుకోసం ఎవరొకరు ఇంటికి వస్తూండేవారు.ముసలితండ్రి....ఎవరుబాబూ వచ్చిందిఅని అడిగాడు కొడుకు విసుగ్గా వచ్చినతని పేరు చెప్పాడు.మర్నాడు తండ్రి మళ్ళీఅడిగాడు ఎవరూ వచ్చింది?అని.ఎవరైతే మీకెందుకండీ...తిని ఓమూల కృష్ణా రామాఅనుకొంటూ కూర్చోక...ఒకటే ఆరాలు పనీపాటా లేకుండా అంటూకేకలేశాడు కొడుకు.

ముసలితండ్రి ముఖం చిన్నబోయింది.వణుకుతున్న చేతులతో పైకండువా తీసి రాబోతున్న కన్నీటినివత్తుకున్నాడు.ఎందుకుతాతా ఏడుస్తున్నావ్అంటూ మనవడు ఒడిలో చేరాడు.ఏంలేదుబాబూ చిన్నప్పుడు మీనాన్న అదేమిటి? ఇదేమిటి? అని వందసార్లు అడిగినా నేను అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పేవాడిని.కాని ఇప్పుడు నేను ఒకసారి అడిగితేనే విరుచుకుపడుతున్నాడు అంటూ ఎంతో బాధగాచెప్పాడు.మనవడు తన చిట్టి చేతులతోతాతని ఓదార్చాడు.

మరికొన్నేళ్ళు కాలచక్రంలో తిరిగిపోయాయి.ఇప్పుడు కొడుకు ముసలి తండ్రి అయ్యాడు, మనవడు కొడుకు స్థానంలోకి వచ్చాడు. కంటిచూపు మందగించి ప్రతిదాన్నీ ఇదేమిట్రా అంటూ కొడుకును వేధించసాగాడు తండ్రి. కాని కొడుకు ఏమాత్రం కసురుకోకుండా అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెపుతూ తండ్రికి ఏలోటూ రాకుండాఅన్ని జాగర్తలూ తీసుకొంటూ చిన్న పిల్లాడిలా చూసుకొనేవాడు.

ఒకరోజు కొడుకు స్నేహితుడు అతడ్ని కలవటానికి ఇంటికివచ్చాడు.ఎవర్రా అదీ....అంటూ వివరాలుఅడగసాగాడు తండ్రి.ఏదో ముక్తసరిగా జవాబిచ్చిలోపలికెళ్ళిన అతను ఎలా భరిస్తున్నావురా బాబూ ఈముసలాయాన్నిఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించక అని విసుగ్గా అన్నాడు తన స్నేహితుడితో.
అదేంట్రా అలా మాట్లాడతావ్...మనల్ని పెంచి పెద్ద చేయడానికి అమ్మానాన్నా ఎంత కష్టపడి వుంటారు? మనల్ని ఎంత ప్రేమగా చూసేవారో,మనమెన్ని అల్లరిపనులు చేసినా ఓర్పుగా భరించేవారు.మనకు చదువుసంధ్యలు చెప్పించి,ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళూ మనకోసం కష్టపడి కూడబెట్టి,మనల్నిఅందలం ఎక్కించడంకోసం ఎలా వారి చెమటతో సోపానం ఏర్పరిచారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.ఇప్పుడు వారు మనపట్ల బాధ్యతలన్నీ నెరవేర్చి వయసుడిగి వృద్ధులైతే...వారు పనికిరానివారైనట్లుకాదు. వారికి వారిబాల్యం తిరిగొచ్చినట్టు. అందుకే మనం వారిని చిన్నపిల్లలతో సమంగా చూసుకోవాలి.

కొడుకు తనస్నేహితుడితో చెబుతున్న మాటలువిన్న తండ్రికి తన తండ్రిపట్ల తనెంత అనుచితంగా ప్రవర్తించింది గుర్తుకువచ్చి సిగ్గుతో కృంగిపోయాడు. తలపైకెత్తి కన్నీళ్ళతో....నాన్నా..ఏలోకంలో ఉన్నావో, నన్ను క్షమించు నాన్నా!ఆర్తిగా వేడుకున్నాడు. అలలా ఓ చిరుగాలి అతన్ని స్పృశించింది ఓదార్పుగా....నాన్న మనసులా....

**ఆదివారం సత్యమేవజయతే చూసినప్పుడు, తాము అడుక్కున్న డబ్బుతో కూడా తమను తరిమేసిన పిల్లలకు,మనవలకు ఏదైనా కొనుక్కుని తీసుకెల్తారని విన్నపుడు మనసు ద్రవించింది.అందుకే అన్నారు అమృతం తాగినవాళ్ళూ...దేవతలూ, దేవుళ్ళూ....అవి కన్నబిడ్డలకు పంచే వాళ్ళూ అమ్మానాన్నలూ...అన్నారు.
** చిన్నపుడెపుడో విన్న కధకు కొనసాగింపునిచ్చాను. బావుందాండి?